కల్వకుర్తి, ఏప్రిల్ 28: వేసవికాలం వచ్చిదంటే కొబ్బరి బోండాలు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్, నిమ్మరసం, మజ్జిగ గుర్తుకొస్తాయి. ఇప్పుడు కాస్త ట్రెండ్మారింది. కొబ్బరి బోండాల ధరలు ఆకాశానంటుతుండడంతో దాహార్తిని తగ్గించుకోవడానికి మెల్లమెల్లగా పండ్లరసాల వైపు అడుగులు వేస్తున్నారు. గతంలో పెద్దపెద్ద పట్టణాలు, నగరాల్లో మాత్రమే లభ్యమయ్యే పండ్లరసాలు ఇప్పుడు పట్టణాలకు విస్తరిస్తున్నాయి. రొటీన్ పండ్ల రసాలు ద్రాక్ష, పైనాపిల్, బత్తాయితోపాటు మరో పదిరకాల పండ్ల రసాలను వివిధ ఫ్లేవర్స్లో తయారు చేసి అందిస్తుండడంతో పండ్లరసాల ప్రియులు తమకు నచ్చిన వాటిని తాగుతూ ఫ్లేవర్స్ను ఎంజాయ్ చేస్తున్నారు. కూల్ డ్రింక్స్ కన్నా వందశాతం పండ్లల్లో విటమిన్లు సమృద్ధిగా లభిస్తుండడంతో పండ్ల రసాలకు రోజురోజుకూ గిరాకీ పెరుగుతోంది. రోటీన్గా కాకుండా కొంగొత్త రకాల పండ్లరసాలు ఆకర్షణీయమైన ధరలలో విక్రయిస్తుండడంతో పండ్ల వ్యాపారులకు భలే గిరాకీ లభిస్తోంది. కల్వకుర్తి పట్టణంలోని బస్టాండ్తోపాటు పలు చౌరస్తాల్లో పండ్లరసాల దుకాణాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి చూసిన ఏ ఒక్కరైనా తప్పకుండా తాగిపోయే విధంగా ఫ్రైష్గా తయారు చేసి అందిస్తున్నారు.
రూ.20 నుంచి మొదలుకొని రూ.100వరకు..
పండ్ల రసాల ధరలు ప్రజలు ఇష్టపడి తీసుకునేలా కూల్ డ్రింక్ ధరలకు ఇంచుమించుగా సమానంగా ఉండడంతో పండ్ల రసాలకు మంచి గిరాకీ ఉంటున్నది. పండ్ల లభ్యతను బట్టి రూ.20మొదలుకుని రూ.100 వరకు రసాలను విక్రయిస్తున్నారు. పైనాపిల్, బత్తాయి, ద్రాక్ష, స్ట్రాబెర్రీ, ఆపిల్, సపోట, కివి, డ్రాగన్ ఫ్రూట్, జామ, అంజీర్, అరటి, పుచ్చకాయ, కర్బూజ, లిచి, అవోకాడో, కాక్టేల్, బీట్రూట్, ఫ్రూట్ పంచ్, క్యారెట్, మల్బరీ, దానిమ్మ, ఆరంజ్, బొప్పాయితోపాటు పలు రకాల సలాడ్ రసాలు ఇరవైకిపైగా నోరూరించే పండ్ల రసాలను వినియోగదారుడు కోరిన వెంటనే ఫ్రెష్గా అందిస్తుండడంతో వినియోగదారులకు చక్కటి ఆరోగ్యం… పండ్ల రసాల వ్యాపారులకు వ్యాపారం ఉంటోంది.