తిరుపతి,మే 23: ఏపీలోని కడప జిల్లా జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ఆదివారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలను నిర్వహించారు.
సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 9.30 నుంచి 10.30 గంటల మధ్య ధ్వజారోహణ ఘట్టం జరిగింది. ముందుగా ధ్వజస్తంభం వద్ద విశేషపూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా విష్వక్సేన పూజ, కలశ ప్రతిష్ట, వాసుదేవ పుణ్యాహవాచనం, నవకలశ ఆరాధన, ధ్వజస్థంభానికి అభిషేకం నిర్వహించారు.
ప్రతి రోజు ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు ఆలయంలో ఏకాంతంగా వాహన సేవలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు చిప్పగిరి ప్రసాద్ దంపతులు, ఇతర ఆధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.