నాగ చైతన్య ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. హిట్టు ఫ్లాపులతో పని లేకుండా వరస సినిమాలు చేస్తున్నాడు అక్కినేని వారసుడు. ఇప్పటికే ఈయన నటించిన లవ్ స్టోరీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడింది. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. దాదాపు 35 కోట్లకు పైగా బిజినెస్ కూడా చేసింది లవ్ స్టోరీ. ఫిదా తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై కూడా అంచనాలు అలాగే ఉన్నాయి. సాయి పల్లవి ఈ సినిమాలో నాగ చైతన్యతో జోడీ కట్టింది. ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటు థ్యాంక్ యూ సినిమాలోనూ నటిస్తున్నాడు చైతూ.
మనం లాంటి క్లాసిక్ తర్వాత మరోసారి విక్రమ్ కే కుమార్ తో చైతూ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు సగం పూర్తయింది. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మొన్నటి వరకు ఇటలీలో ఈ చిత్రం షూటింగ్ జరిగింది. ఈ మధ్యే అక్కడి షెడ్యూల్ ముగించుకుని వచ్చారు చిత్ర యూనిట్. 2021 చివర్లో ఈ సినిమాను విడులద చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. దీనికి తగ్గట్లుగానే షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలు నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో వార్తలు కూడా మొదలయ్యాయి. హీరో ఎన్నారై బిజినెస్ మెన్ గా నటిస్తున్నాడు.
తన జన్మరహస్యం.. పుట్టుక మూలాల గురించి తెలుసుకుని ఇండియాకు వస్తాడు. అక్కడ తన కుటుంబ సభ్యులు తల్లిదండ్రులను వెదికేందుకు ప్రయాణం మొదలు పెడతాడు. ఈ క్రమంలోనే అతడికి ఎదురైన సంఘటనలే థ్యాంక్ యూ కథ అని తెలుస్తుంది. మనం సినిమాలో పునర్జన్మ కాన్సెప్ట్ చూపించిన దర్శకుడు విక్రమ్ ఇప్పుడు మాత్రం కాస్త కొత్త స్క్రీన్ ప్లే ఉన్న జన్మలోనే తన తల్లిదండ్రులను వెతుక్కునే కథ చూపించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. మనం తర్వాత ఆ స్థాయి సక్సెస్ కోసం చూస్తున్నాడు విక్రమ్. 24 సినిమా అంచనాలు అందుకోలేదు.. గ్యాంగ్ లీడర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు థ్యాంక్ యూతో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.
ఇవికూడా చదవండి..