రామ్చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతాన్నందిస్తున్నారు. ఈ విషయాన్ని సోమవారం చిత్రబృందం ప్రకటించింది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘బాయ్స్’ చిత్రంలో తాను నటించానని..ఇప్పుడు ఆయన సినిమాకు స్వరకర్తగా పనిచేయడం చాలా సంతోషంగా ఉందని తమన్ పేర్కొన్నారు. ‘శంకర్ నిర్మించిన ‘వైశాలి’ చిత్రానికి నేను సంగీతాన్నందించా. ట్యూన్స్ విన్న వెంటనే బాగున్నాయని ఓకే చేశారు. సుదీర్ఘ విరామం తర్వాత ఆయనతో కలిసి పనిచేయడం మరచిపోలేని అనుభూతినిస్తోంది’ అని తమన్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో రామ్చరణ్ ఉపోద్ఘాతం తాలూకు పాట రికార్డింగ్ కార్యక్రమాల్ని తమన్ ఇటీవలే ప్రారంభించారు. ఇందుకోసం దర్శకుడు శంకర్ హైదారాబాద్కు వచ్చారు. ఈ గీతం కోసం 135 మంది సంగీత బృందం పనిచేశారని, పాట విని అందరూ ప్రశంసించారని చిత్ర బృందం పేర్కొంది. దిల్రాజు నిర్మిస్తున్న యాభయ్యవ చిత్రంగా ఈ ప్రాజెక్ట్పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్లో సెట్స్మీదకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.