మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం తలైవి. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. థియేటర్స్లోవిడుదల అవుతుందా, ఓటీటీలో విడుదల అవుతుందా అనే అనుమానం అభిమానులలో ఉండగా, దానిపై క్లారిటీ ఇచ్చింది చిత్ర బృందం.
కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తలైవి చిత్రంలో అరవింద స్వామి ఎంజీఆర్ పాత్రలో కనిపించనున్నారు.ఈ చిత్రానికి ఏ.ఎల్ విజయ్ డైరెక్షన్ వహిస్తున్నారు. గత సంవత్సరం విడుదల కావాల్సిన ఈ సినిమా.. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు సినిమా విడుదల తేదీని ప్రకటించారు. సెప్టెంబర్ 10న తలైవి థియేటర్లో రానున్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
‘ఐకానిక్ వ్యక్తి కథని పెద్ద తెరపైనే చూడాలి. తలైవి కోసం, ఆమె సినిమా ప్రపంచంలోకి సూపర్స్టార్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నందున, ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 10న విడుదల చేయబోతున్నాం’ అంటూ నిర్మాణ సంస్థ విడుదల తేదీని ప్రకటించారు. దేశవ్యాప్తంగా థియేటర్లు తిరిగి తెరుస్తున్నందున అభిమానులు వెండి తెరపై లెజెండ్ జయలలిత జీవితం లోని గొప్ప అనుభూతిని ఆస్వాధించగలరని సంతోషిస్తున్నాము అని నిర్మాత విష్ణు వర్ధన్ ఇందూరి స్పస్టం చేశారు. ఈ చిత్రంలో ఎంజీఆర్ భార్యగా మధుబాల నటిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ఈ మూవీని విడుదల చేయనున్నారు.