పురుచ్చతలైవి జయలలిత జీవిత నేపథ్యంలో తలైవి టైటిల్తో ఏఎల్ విజయ్ సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావలసి ఉన్న కరోనా వలన వాయిదా పడింది. ఇందులో ఎంజీఆర్గా అరవింద్ స్వామి నటించారు. ఈ చిత్రంకు సంబంధించి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులలో అమితాసక్తిని కలిగించాయి.
అయితే తలైవి చిత్రానికి సీక్వెల్ రూపొందించాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్టు తెలిసింది. మొదటి భాగంలో జయలలిత నట జీవితం, రాజకీయ రంగ ప్రవేశం, ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టే వరకు చూపించనుండగా, రెండో భాగంలో ఆమె జీవితంలో ఎదురైన ఇబ్బందులు , అంతిమ యాత్ర వంటి విషయాలను చూపించనున్నారట. తలైవి చిత్రానికి మాటలు అందిస్తున్న మదన్ కార్గీ ట్విట్టర్లో .. జయలలిత గురించి రజనీకాంత్ కొన్ని విషయాలను చెప్పారని, రెండో భాగం ఉంటే ఆ విషయాలు అందులో పొందుపరిచే అవకాశం ఉందని అన్నారు. చూడాలి మరి దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో.