“తలైవి’ చిత్ర నాన్ థియేట్రికల్ రైట్స్తో పెట్టుబడి మొత్తం తిరిగొచ్చేసింది. సినిమా విజయం పట్ల మా టీమ్ అంతా చాలా సంతోషంగా ఉన్నాం’ అని చెప్పారు విష్ణువర్ధన్ ఇందూరి. ఆయన నిర్మాణంలో కంగనారనౌత్ కథానాయికగా నటించిన చిత్రం ‘తలైవి’. తమిళనాడు మాజీముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితకథ ఆధారంగా రూపొందించిన ఈ చిత్రానికి ఎ.ఎల్.విజయ్ దర్శకుడు. ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చింది. ఈ సందర్భంగా సోమవారం నిర్మాత విష్ణువర్ధన్ ఇందూరి పాత్రికేయులతో సంభాషించారు.
కరెక్ట్ నిర్ణయం అంటున్నారు
సినిమాను థియేటర్ రిలీజ్ కోసమే తీశాం. ఎన్నో ఓటీటీ ఆఫర్లొచ్చినా తొలిప్రాధాన్యత థియేటర్లకే ఇచ్చాం. సినిమాకు నాన్థియేట్రికల్ రెవెన్యూ బాగానే వచ్చింది. బాక్సాఫీస్ లెక్కలకంటే సినిమా ఎంతమందికి చేరువయిందన్నదే ముఖ్యమని నేను నమ్ముతా. జయలలిత గురించి ప్రపంచం మొత్తం తెలుసుకోవాలనే సంకల్పంతో ఈ సినిమా చేశాం. తొలుత కంగనారనౌత్ను కథానాయిక అనగానే అందరూ బ్యాడ్ఛాయిస్ అన్నారు. తమిళనాడులో ఆమె అంతగా తెలియదు కాబట్టి సోషల్మీడియాలో నెగెటివ్ ప్రచారం చేశారు. సినిమా విడుదలైన తర్వాత మా నిర్ణయం సరైనదేనని మెచ్చుకుంటున్నారు.
బయోపిక్స్ ఇష్టం
మొదట్లో ఈ సినిమాపై జయలలిత కుటుంబ సభ్యులు కేసులు వేశారు. సినిమా చూశాక వారి నిర్ణయం మారింది. జయలలితకు ఇంతకంటే గొప్పగా ఎవరూ నివాళిని ఇవ్వలేరని చెబుతున్నారు. తమిళనాడులో స్క్రీన్స్ పెంచే ఆలోచనలో ఉన్నాం. స్వతహాగా నాకు బయోపిక్స్ అంటే ఇష్టం. మరో మూడునాలుగు సినిమాలు ప్లాన్ చేశాం. హిందీలో వరుస సినిమాలున్నాయి. కపిల్దేవ్ బయోపిక్ ‘1983’ చిత్రాన్ని థియేటర్లో విడుదల చేయాలనుకుంటున్నాం. మంచి తేదీ కోసం ఎదురుచూస్తున్నాం. సోషల్మీడియా నేపథ్యంలో ‘ట్రెండింగ్’ పేరుతో ఓ సినిమా చేస్తున్నాం. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తాం. ‘ఆజాద్హింద్’ అనే దేశభక్తి సినిమాకు కూడా ప్లాన్ చేస్తున్నాం.