దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘తలైవి’. కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా చిత్రీకరణతో పాటు నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. తొలుత ఏప్రిల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సినిమా యూనిట్ భావించినా లాక్డౌన్ కారణంగా కుదరలేదు. ప్రస్తుతం థియేటర్ల పునఃప్రారంభానికి అన్ని రాష్ర్టాలు అనుమతులు మంజూరు చేస్తున్న నేపథ్యంలో ఆగస్ట్లో సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం యోచిస్తున్నట్లు తెలిసింది. తమిళ వెర్షన్కు సంబంధించి సెన్సార్ పూర్తయినట్లు మంగళవారం నిర్మాతలు ప్రకటించారు. తెలుగు, హిందీ వెర్షన్ సెన్సార్ పనుల్ని త్వరలో పూర్తిచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అరవింద్స్వామి, పూర్ణ ఈ సినిమాలో కీలక పాత్రల్ని పోషిస్తున్నారు.