హఫీజ్పేట్, మార్చి25: సమాజాన్ని తీక్షణంగా గమనిస్తూ..దేశ పౌరులుగా మన చుట్టూ ఉండేవారికి మనమేమైనా చేయగలమా.. అని ఆలోచించే వారు కొందరే ఉంటారు. అలాంటి వారే ఆ యువకులు. వీరంతా వివిధ కోర్సులు చదువుతున్న విద్యార్థులు, కాలేజీ స్టూడెంట్స్. అందరి లక్ష్యం ఒక్కటే.. సామాజిక సేవ చేయాలన్నదే ధ్యేయం. ఆ తపనే వారందరినీ ఏకతాటిపై నిలబడేలా చేసింది. ఆర్థిక స్థోమత లేక చదువుకోలేకపోతున్న వారిని దత్తత తీసుకొని.. విద్యాకుసుమాలుగా తీర్చిదిద్దే బాధ్యత భుజాన వేసుకున్నారు. వైద్యశిబిరాల ద్వారా నిరుపేదల ఆరోగ్య పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తున్నారు.
అలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దని…
రోహిత్ ముదిరాజ్ది చందానగర్లోని గంగారం గ్రామం. చదువు కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు. పార్ట్టైం ఉద్యోగం చేసుకుంటూ.. బీటెక్ పూర్తిచేశాడు. అప్పుడే అతని మనసులో ఓ ఆలోచన వచ్చింది. తనలాంటి పరిస్థితి ఎవరికీ రావద్దనే ఉద్దేశంతో 2010లో అతడితో పాటు మరో ఆరుగురితో కలిసి ఆయువు స్టూడెంట్ యూత్ ఫౌండేషన్ను స్థ్ధాపించాడు. మొత్తం ఏడుగురు సభ్యులతో మొదలైన ప్రస్థ్ధానం.. ప్రస్తుతం వివిధ జిల్లాలతో కలుపుకొని 160 మంది సభ్యులకు చేరుకున్నది.
ఆర్థిక సమస్యలతో..
ఆర్థిక సమస్యలతో చదువుకోలేకపోతున్న పిల్లలను దత్తత తీసుకొని.. సొంత డబ్బులతో చదివిస్తున్నారు ‘ఆయువు’ సభ్యులు. అనాథాశ్రమాలు, మురికివాడల్లో ఉన్న పిల్లలకు ఏటా దుస్తులు, స్టడీమెటీరియల్ అందిస్తున్నారు. వీలైనప్పుడల్లా అక్కడకు వెళ్లి విద్యాబోధన చేస్తున్నారు. వృద్ధాశ్రమాల్లో అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి మందులు ఇస్తున్నారు. ఆరోగ్యపరిరక్షణకు తండాల్లో ఉచిత వైద్యశిబిరాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం, రక్తం అవసరమున్న వారికి రక్తదానం వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ..స్ఫూర్తినిస్తున్నారు.
లాక్డౌన్ సమయంలో..
లాక్డౌన్లో ఇబ్బంది పడిన వివిధ రాష్ర్టాలకు చెందిన కూలీలకు సుమారు 600 కూలీల కుటుంబాలకు ఆయువు సభ్యులు నెలరోజులకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సేవలను గుర్తించిన విశ్వగురు వరల్డ్ సంస్థ వారు కరోనా వారియర్ అవార్డు ఇచ్చి సత్కరించారు.
కార్యకలాపాల విస్తరణ..
నగరంతో పాటు మా కార్యకలాపాలను వివిధ జిల్లాలకు విస్తరించాం. ఇప్పటివరకు తమ స్వచ్ఛంద సంస్థలో 160 మంది సభ్యులున్నారు. వీరంతా చదువుకునే విద్యార్థులే. తాము సొంతంగా కూడబెట్టుకున్న డబ్బులతో పాటు దాతలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ కింద సంస్థలు అందిస్తున్న సహకారంతో సామాజిక సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా చేపడుతున్నాం.
-రోహిత్ముదిరాజ్, ఆయువు స్టూడెంట్ యూత్ ఫౌండేషన్ వ్యవస్థ్ధాపకుడు