భువనేశ్వర్ : కరోనా కేసుల పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని పూరీలోని ప్రఖ్యాత జగన్నాథుడి ఆలయంలో భక్తుల దర్శనాలు నిలిపివేస్తున్నట్లు దేవస్థానం బోర్డు తెలిపింది. ఈ నెల 5న ఒడిశా ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో ఆలయం మూసివేశారు. శ్రీ జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషటర్ క్రిషన్కుమార్, కలెక్టర్ సమర్త్ వర్మ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆలయాన్ని వచ్చే నెల 15వ తేదీ వరకు మూసే ఉంచాలని నిర్ణయించారు. పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను సమీక్షించాలని నిర్ణయించారు.
అయితే, ఆలయంలో స్వామివారికి ఆనవాయితీగా వస్తున్న ఆచారాలు కొనసాగుతాయని, అర్చకులు, సేవకుల సహాయంతో సాగుతాయని క్రిషన్కుమార్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కొవిడ్ ప్రోటోకాల్స్ మేరకు చందన్ యాత్ర శనివారం ప్రారంభమైంది. ఇందులో పాల్గొన్న వారందరికీ కొవిడ్ పరీక్షలు చేయించారు. రథాల నిర్మాణానికి సంబంధించిన పనులు పూర్తయ్యే వరకు వడ్రంగి, ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా ఉంచనున్నట్లు ఓ అధికారి తెలిపారు. కరోనా మొదటి వేవ్లో పెద్ద ఎత్తున ఆలయ అర్చకులు, సేవకులు కరోనా బారినపడ్డ విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఆదివారం ఒడిశాలో 11,732 పాజిటివ్ కేసులు నమోదవగా.. మొత్తం కేసుల సంఖ్య 6.12లక్షలు దాటింది.