అంతర్జాతీయ క్రికెట్లో గత కొద్దిరోజులుగా అన్ని ఫార్మాట్లలో పరుగుల వరదపారిస్తున్న టీమ్ఇండియా యువ వికెట్ కీపర్-బ్యాట్స్మన్ రిషబ్ పంత్( Rishabh Pant ) చరిత్ర సృష్టించాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్టు బ్యాట్స్మన్ ర్యాంకింగ్స్( ICC Test Rankings )లో పంత్ ఆరో ర్యాంకు సాధించాడు. 23ఏండ్ల వయసులోనే పంత్ ఈ ఘనత సాధించడం విశేషం.
ఐసీసీ టెస్టు బ్యాట్స్మన్ ర్యాంకింగ్స్ టాప్-10లో వికెట్ కీపర్ బ్యాట్స్మన్ చోటు దక్కించుకోవడం
భారత క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి. భారత వికెట్ కీపర్ ఈ ఫార్మాట్లో సాధించిన అత్యధిక ర్యాంకింగ్ ఇదే. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో అద్భుత ప్రదర్శన చేసిన పంత్ ర్యాంకింగ్ పాయింట్లను మెరుగుపరచుకున్నాడు.
ఈ క్రమంలోనే పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ను పంత్ వెనక్కి నెట్టి ఆరో స్థానం దక్కించుకున్నాడు. టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ( Virat Kohli ) ఐదులో కొనసాగుతున్నాడు. పంత్తో పాటు హెన్రీ నికోల్స్-7, రోహిత్ శర్మ-8 కూడా 747 రేటింగ్ పాయింట్లతో టాప్-10లో ఉన్నారు. న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ 919 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.