2017 డ్రగ్ కేసుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ విచారణకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టాలీవుడ్ ప్రముఖులను విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో నోటీసులు అందుకున్న పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, రకుల్ ప్రీత్ సింగ్, రానా, రవితేజ, రవితేజ డ్రైవర్ శ్రీనివాస్, ముమైత్ ఖాన్, నవదీప్ వంటి వారు విచారణకు హాజరయ్యారు. వీరిని ఈడీ ఐదు గంటల పైనే విచారించారు.
ఇక ఈ రోజు నటుడు తనీష్ ఈడీ విచారణకు హాజరయ్యారు. మనీ లాండరింగ్ కోణంలో అనుమానాస్పద లావాదేవీల గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే డ్రగ్స్ విక్రేత కెల్విన్తో ఉన్న సంబంధాలు? ఎఫ్ క్లబ్లో జరిగే పార్టీలకు ఎప్పుడైనా హాజరయ్యారా? డ్రగ్స్ ఎప్పుడైన తీసుకున్నారా? అనే విషయాలపై ఆయనను ప్రశ్నించనున్నట్టు తెలుస్తుంది. అయితే విచారణకు వెళ్లబోయే ముందు మీడియాతో మాట్లాడిన తనీష్.. తనకు కెల్విన్ అనే వ్యక్తితో ఎలాంటి పరిచయాలు లేవని తెలియజేశాడు.ఈడీ విచారణకు సహకరిస్తానని చెప్పాడు. తనీష్ ప్రస్తుతం మరో ప్రస్థానం చిత్రంతో బిజీగా ఉన్నాడు. సెప్టెంబర్24న ఈ చిత్రం విడుదల కానుంది.