హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): ప్రజలకు కొవిడ్ వ్యాక్సిన్ వేయించడంలో అనేక రాష్ట్రాలు సతమతమవుతున్నాయని.. ప్రధాని నరేంద్రమోదీ ఈ విషయంలో సమాఖ్య స్ఫూర్తిని చాటాలని ఐటీశాఖ మంత్రి, కొవిడ్ టాస్క్ఫోర్స్ కమిటీ చైర్మన్ కే తారకరామారావు సూచించారు. కేంద్రం జనాభా ప్రాతిపదికన రాష్ర్టాలకు వ్యాక్సిన్ కేటాయింపులు చేయడం లేదని తెలిపారు. వ్యాక్సిన్ హబ్గా ఉన్న హైదరాబాద్ (తెలంగాణ)కే వ్యాక్సిన్ దొరకకపోవడం దురదృష్టకరమన్నారు. గురువారం మంత్రి కేటీఆర్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. వ్యాక్సిన్ సరఫరాలో కేంద్రం అనుసరిస్తున్న విధానంపై అసహనం వ్యక్తంచేశారు. రాష్ర్టానికి కోటి డోసుల వ్యాక్సిన్ కావాలని కోరామని.. మేం కోరినదానికి కేంద్రం కేటాయిస్తున్న కోటాకు పొంతనే లేదని తెలిపారు. ప్రధానమంత్రి మోదీ పదేపదే చెప్పే టీమ్ఇండియా స్ఫూర్తిని వ్యాక్సిన్ పంపిణీలో అమలుచేయాలని విజ్ఞప్తిచేశారు. అమెరికా, డెన్మార్క్, కెనడా తదితర దేశాల్లో వ్యాక్సిన్ మిగులు నిల్వలున్నాయని.. కానీ, భారత్లో మాత్రం అలాంటి పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. కేంద్రప్రభుత్వం ఇప్పటికైనా ఒక అడుగు ముందుకేసి రాష్ర్టాల డిమాండ్కు సరిపడా వ్యాక్సిన్లు అందించేందుకు తోడ్పాటునందించాలని సూచించారు.