కేపీహెచ్బీ కాలనీ, మే 5 : కరోనా కట్టడికి పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. బుధవారం జోన్ పరిధిలోని కూకట్పల్లి సర్కిల్ బాగ్అమీర్, దయార్గూడలలో పర్యటించారు. బస్తీ దవాఖానలలో ఔట్ పేషెంట్ సేవలను పరిశీలించడంతో పాటు ఫీవర్ సర్వేను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూకట్పల్లి జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో కరోనాను నియంత్రించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బస్తీ దవాఖానలు, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ప్రత్యేకంగా ఔట్ పేషెంట్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. జ్వరం, జలుబు, దగ్గు లాంటి లక్షణాలు కనిపించిన వారికి సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు అవసరమైన మందులను అందజేస్తున్నారని పేర్కొన్నారు. సమస్య తీవ్రంగా ఉంటే కరోనా పరీక్షలు చేయించి మెడికల్ కిట్ను అందించడం.. హోమ్ ఐసొలేషన్ వసతులు లేనివారి కోసం కేర్ సెంటర్లను ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కాలనీలు, బస్తీలలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాలను పిచికారీ చేస్తున్నట్లు తెలిపారు.
కరోనాను నియంత్రించడంలో భాగంగా చేపట్టిన ఇంటింటి ఫీవర్ సర్వే జోరుగా కొనసాగుతుందన్నారు. ఐదు సర్కిళ్లలో కలిపి 76 బృందాలు సమస్యాత్మక ప్రాంతాలలో ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తున్నట్లు వివరించారు. మూడోరోజు జోన్ పరిధిలో 3982 ఇండ్లలో సర్వే చేయగా 147 ఇండ్లలో జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నవారిని గుర్తించి మెడికల్ కిట్ను అందించినట్లు తెలిపారు. సర్కిళ్ల వారీగా పరిశీలిస్తే మూసాపేట సర్కిల్లో 1155 ఇండ్లలో సర్వే చేసి 147 మెడికల్ కిట్లను పంపిణీ చేశారు. కూకట్పల్లి సర్కిల్లో 1484 ఇండ్లకు గాను 54 మెడికల్ కిట్లు, కుత్బుల్లాపూర్లో 350 ఇండ్లకు గాను 25 మెడికల్ కిట్లు, గాజులరామారంలో 620 ఇండ్లకు గాను 12 మెడికల్ కిట్లు, అల్వాల్లో 323 ఇండ్లకు గాను 30 మెడికల్ కిట్లు అందజేశారు. ఫీవర్ సర్వేలో ప్రజలందరూ సహకరించాలని అనారోగ్య సమస్యలుంటే వెంటనే సిబ్బందికి తెలియజేసి మెడికల్ కిట్లు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కూకట్పల్లి సర్కిల్ ఉప కమిషనర్ వి.ప్రశాంతి, ఏఎంహెచ్వో సంపత్కుమార్ పాల్గొన్నారు.