చిత్రసీమలో సుదీర్ఘకాలంగా కథానాయికగా రాణిస్తోంది మిల్కీబ్యూటీ తమన్నా. వన్నెతరగతి అందచందాలు, చక్కటి అభినయకౌశలంతో ప్రేక్షకుల్ని మెప్పిస్తోంది. దక్షిణాది అగ్ర కథానాయికల్లో ఒకరిగా గుర్తింపు పొందిన ఈ అమ్మడు ఇటీవలకాలంలో కథాంశాలు, పాత్రల ఎంపికలో కొత్తదనానికి పెద్దపీట వేస్తున్నది. వాణిజ్య చిత్రాలతో పాటు ప్రయోగాత్మక ఇతివృత్తాల్లో సత్తాచాటుతున్నది. ఇటీవల విడుదలైన ‘మాస్ట్రో’ చిత్రంలో నెగెటివ్ ఛాయలున్న పాత్రలో ఆకట్టుకుంటున్నది. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ..ఓ నటిగా సవాళ్లను స్వీకరించడానికి తాను సదా సిద్ధంగా ఉంటానని స్పష్టం చేసింది. ఇమేజ్ ఛట్రాల్ని ఛేదించుకొని పరిధుల్ని విస్తరించుకోవాలంటే ప్రయోగాలు చేయాల్సిందేనని పేర్కొంది. ఆమె మాట్లాడుతూ ‘థ్రిల్లర్ చిత్రాల్లో పాత్రలోని భిన్న పార్శాలను ప్రదర్శించే అవకాశం దక్కుతుంది. పాత్ర స్వభావం, తీరుతెన్నుల గురించి ప్రేక్షకుల్లో ఆద్యంతం ఆసక్తినెలకొని ఉంటుంది. అలాంటప్పుడే మనలోని ప్రతిభ బయటకొస్తుంది. ప్రతినాయిక పాత్రల్లో మెప్పించడమే నిజమైన చాలెంజ్గా ఉంటుంది’ అని చెప్పింది. నెగెటివ్ పాత్ర అయినా తన అభినయానికి ప్రశంసలు దక్కుతున్నాయని తమన్నా చెప్పింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ఎఫ్-3, గుర్తుందా శీతాకాలం చిత్రాల్లో నటిస్తోంది.