న్యూఢిల్లీ : సీనియర్ రెజ్లర్ సుశీల్కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఓ రెజ్లర్ మృతి కేసులో తప్పించుకొని తిరుగుతుండగా.. సుశీల్ ఆచూకీ చెబితే రూ.లక్ష, అతని అనుచరుడి గురించి సమచారం ఇస్తే రూ.50వేల రివార్డ్ ఇవ్వనున్నట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 4న దేశ రాజధాని ఢిల్లీలోని ఛత్రశాల స్టేడియంలో ఘర్షణ చోటు చేసుకోగా.. సాగర్ దండక్ అనే రెజ్లర్ మృతి చెందిన విషయం తెలిసిందే. సుశీల్ కుమార్, అతని అనుచరులు దాడి చేయడంతోనే తీవ్ర గాయాలై మృతి చెందినట్లు ఢిల్లీ పోలీసులు ఆధారాలు సేకరించి, కేసులు నమోదు చేశారు.
ప్రత్యక్ష సాక్షులు, గాయపడిన ఇతర రెజ్లర్లను విచారించి పలు విషయాలు తెలుసుకున్నారు. హాకీ, బేస్బాల్ బ్యాట్లతో సుశీల్ స్వయంగా దాడి చేసినట్లు ఒక వీడియోలో స్పష్టంగా ఆధారాలు దొరికాయి. దీంతో పోలీసులు సుశీల్పై హత్య కేసు నమోదు చేసి, అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఘటన చోటు చేసుకున్న నాటి నుంచి సుశీల్ కుమార్ పోలీసులకు కనిపించకుండా తప్పించుకున్నాడు. అతడితో పాటు అతని స్నేహితులపై పోలీసులు ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. అతడి కోసం 20 బృందాలుగా విడిపోయిన 50 మంది ఢిల్లీ పోలీసులు గాలిస్తున్నారు. సుశీల్తో పాటు మరో ఆరుగురిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని ఢిల్లీ పోలీసులు కోర్టుకు దరఖాస్తు చేయగా.. వారెంట్ జారీ చేస్తూ ఢిల్లీ కోర్టు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే, పక్షం రోజులుగా కనిపించకుండా పోయిన సుశీల్ కుమార్ అసలు ఎక్కడ తలదాచుకున్నాడనేది తెలియడం లేదు. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్లో పలు చోట్ల గాలింపులు చేపట్టారు. అయినా, ఎలాంటి ప్రయోజం లేకపోయింది. ఈ క్రమంలో చివరి అస్త్రంగా ఢిల్లీ పోలీసులు ఆచూకీ చెబితే రూ.లక్ష రివార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అలాగే ఇదే కేసులో అతని అనుచరుడు అజయ్ అనే వ్యక్తి సమాచారం ఇస్తే రూ.50వేల రివార్డు ఇవ్వనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరో వైపు ఇవాళ ఢిల్లీ రోహిణి కోర్టులో సుశీల్కుమార్ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరుగనుంది.