సుల్తాన్బజార్, మే 25: దేశవ్యాప్తంగా బ్లాక్ఫంగస్ కేసులు పెరుగుతుండటంతో ఇప్పుడు అందరిచూపు కోఠిలోని ప్రభుత్వ ఈఎన్టీ దవాఖానపై పడింది. రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికి రోజూ పదుల సంఖ్యలో బ్లాక్ఫంగస్ రోగులు వస్తుండగా, ఇతర రాష్ర్టాల నుంచి కూడా భారీగా తాకిడి ఉన్నది. దవాఖాన టెలిఫోన్ ఎక్స్చేంజ్కు వేర్వేరు రాష్ట్రాల నుంచి బెడ్లకోసం రోజూ రెండువేల ఫోన్కాల్స్ వస్తున్నాయని అధికారులు తెలిపారు.‘బ్లాక్ ఫంగస్ బారిన పడ్డాం. దవాఖానలో బెడ్లు ఖాళీగా ఉన్నాయా? అడ్మిషన్ దొరుకుతుం దా?’ అంటూ .ఫోన్లు చేస్తున్నారు.
కోఠి ఈఎన్టీ దవాఖాన దేశంలోనే అత్యాధునిక సౌకర్యాలున్న దవాఖానగా పేరుగాంచింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిని ఇటీవలే బ్లాక్ఫంగస్ నోడల్ దవాఖానగా మార్చిం ది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈఎన్టీ దవాఖానల్లో బ్లాక్ ఫంగస్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయకపోవడంతో కోఠి ఈఎన్టీకి ఇతర రాష్ట్రాల నుంచి రోగుల తాకిడి అధికమైంది. ఇప్పటికే ఇక్కడ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి వచ్చిన రోగులు చికత్స పొందుతున్నారు. అత్యవసరం ఉన్న ప్రతి రోగిని అక్కున చేర్చుకొని మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఈఎన్టీ వైద్యులు నిరంతరం కృషిచేస్తున్నారు. ప్రాంతీయభేదం లేకుండా వైద్యసేవలు అందిస్తున్నందునే ఇరత రాష్ర్టాల నుంచి రోగులు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ తాటి శంకర్ తెలిపారు. రోగుల తాకిడి అధికమైనా అందరికీ మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.