అమరావతి : జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుటుంబానికి ఏపీ సర్కార్ భారీ ఆర్థికసాయం ప్రకటించింది. పింగళి కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మికి రూ.75 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులను సైతం జారీ చేసింది. ఆజాదీకా అమృత్ మహోత్సవాల ప్రారంభం సందర్భంగా సీఎం జగన్ ఇవాళ గుంటూరు జిల్లా మాచర్లలో పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మిని ఆమె నివాసంలో కలిశారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకొని ఘనంగా సత్కరించారు. అనంతరం ఆర్థికసాయం ఉత్తర్వులను ఆమెకు అందజేసి నగదును ఖాతాలో జమ చేయించారు. జాతీయ పతాకం రూపొందించి మార్చి 31 నాటికి వందేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా పింగళి కుమార్తెను సీఎం సత్కరించినట్లు సీఎంఓ ప్రకటనలో తెలిపింది.