ముంబై, మార్చి 17: గతేడాది ద్వితీయార్ధంలో బ్యాంకుల అసెట్ క్వాలిటీ (ఆస్తుల నాణ్యత) కొంత మేరకు మెరుగుపడినప్పటికీ ఈ ఏడాది ప్రథమార్ధంలో వీటి నాణ్యత క్షీణించవచ్చని ఫిక్కీ-ఐబీఏ సర్వే వెల్లడించింది. 2020 జులై-డిసెంబర్ మధ్య కాలంలో 20 బ్యాంకులపై ఈ సర్వే జరిగింది. వీటిలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని బ్యాంకులతోపాటు విదేశీ బ్యాంకులు కూడా ఉన్నాయి. దేశీయ బ్యాంకింగ్ పరిశ్రమలో ఆస్తుల పరిమాణ పరంగా ఈ బ్యాంకులు దాదాపు 59 శాతం వాటాను కలిగి ఉన్నాయి. గతేడాది ద్వితీయార్ధంలో నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) తగ్గాయని ఈ సర్వే సగం బ్యాంకులు స్పష్టం చేయగా.. ఎన్పీఏల స్థాయి తగ్గినట్లు ప్రభుత్వ రంగంలోని దాదాపు 78 శాతం బ్యాంకులు తెలిపాయి. 2021 ప్రథమార్ధంలో ఎన్పీఏల స్థాయి 10 శాతానికిపైగా పెరగవచ్చని 68 శాతం బ్యాంకులు.. 12 శాతానికిపైగా పెరగవచ్చని 37 శాతం బ్యాంకులు అభిప్రాయపడ్డాయి. మరోవైపు ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి బ్యాంకుల మొత్తం ఆస్తుల్లో మొండి బాకీలు కనీసం 13.5 శాతానికి పెరగవచ్చని జనవరిలో విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదికలో రిజర్వు బ్యాంకు అంచనా వేసింది.
గతేడాది ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల నిరర్థక ఆస్తులు రూ.లక్ష కోట్లకు పైగా (రూ.6,78,317 కోట్ల నుంచి రూ.5,77,137 కోట్లకు) తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఎన్పీఏల గుర్తింపు, పరిష్కారం, సంస్కరణల అమలే ఇందుకు కారణమని పేర్కొన్నది. యూకో బ్యాంక్లో అత్యధికంగా 40.7% ఎన్పీఏలు తగ్గాయని, ఆ తర్వాతి స్థానాల్లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (33.6%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (21.4%), కెనరా బ్యాంక్ (18.6 శాతం) ఉన్నాయని ప్రభుత్వం వివరించింది.