పెద్దేముల్, మార్చి 25: పల్లె ప్రగతి కార్యక్రమంతో కొండాపూర్ గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. ప్రభుత్వం ద్వారా నెలనెలా వచ్చే నిధులను సద్వినియోగం చేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా పనులు చేపడుతున్నారు. గతంలో సమస్యలతో సతమతమయ్యే కొండాపూర్, ప్రస్తుతం సకల సౌకర్యాలతో కళకళలాడుతున్నది. రూ.43.98 లక్షలతో జిల్లా పరిషత్, ఎన్ఆర్ఈజీఎస్, పంచాయతీ నిధులతో చేపట్టిన వివిధ రకాల పనులు పూర్తిచేసుకుని అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది.
రూ.43.98 లక్షలతో అభివృద్ధి పనులు
పల్లె ప్రగతితో కొండాపూర్లోని సమస్యలన్నీ పరిష్కారమయ్యాయి. గ్రామంలో రూ.6.20 లక్షలతో ట్రాక్టర్ను కొనుగోలు చేసి నిత్యం ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. రూ.5 లక్షల జడ్పీ నిధులతోప్రాథమిక పాఠశాలకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయించారు. పంచాయతీ నిధులు రూ.3 లక్షలు, జడ్పీ నిధులు రూ.2 లక్షలు, మండల పరిషత్ నిధులు రూ.లక్షతో ప్రాథమిక పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మించి గేటును ఏర్పాటు చేశారు. రూ.2 లక్షల జడ్పీ నిధులతో రెండు చోట్ల బోర్లు వేయించి మోటర్లు బిగించారు. పంచాయతీ నిధులు రూ.13 లక్షలతో గ్రామంలో పలు కాలనీల్లో మురుగు కాల్వలు నిర్మించారు. ఎంపీటీసీ నిధులు రూ.లక్షతో సీసీ రోడ్డు, రూ.లక్షతో మురుగు కాల్వ నిర్మాణం చేపట్టారు. పలు రకాల నిధులతో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతుండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రగతితో పూర్తిస్థాయి అభివృద్ధి
పల్లె ప్రగతి కార్యక్రమంతో కొండాపూర్ గ్రామం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందింది. గ్రామంలో రూ.58 వేలతో డంపింగ్ యార్డు, రూ.2.50 లక్షలతో కంపోస్టు షెడ్డు, రూ.12.50 లక్షలతో వైకుంఠధామం, రూ.40 వేలతో పల్లె ప్రకృతి వనం నిర్మించారు. డంపింగ్ యార్డుతో సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు. వన నర్సరీలో 10 వేల వివిధ రకాల మొక్కలు నాటారు. హరితహారంలో భాగంగా నాటడానికి మొక్కలను సిద్ధం చేస్తున్నారు.