జైపూర్: కొడుకుపై చేయి చేసుకున్నాడన్న కోపంతో ఓ వ్యక్తి ఏకంగా తన తండ్రినే చంపేశాడు. రాజస్థాన్ రాష్ట్రం బన్స్వారా జిల్లాలోని తండ్వడ్లా గ్రామ పంచాయతీ పరిధిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తండ్వడ్లా గ్రామానికి చెందిన వెస్టా (50) అనే వ్యక్తికి ఇద్దరు కొడుకులు. అయితే, కొడుకులిద్దరూ బతుకుదెరువు కోసం భార్యాపిల్లలతో కలిసి పొరుగునున్న గుజరాత్కు వలస వెళ్లారు. అయితే, చిన్న కొడుకు జయంతి ఎనిమిదేండ్ల కుమారుడు మాత్రం తాత, నాయినమ్మ దగ్గరే ఉంటున్నాడు.
ఈ క్రమంలో ఆదివారం మనవడు తనపట్ల అమర్యాదగా ప్రవర్తించడంతో వెస్టా అతనిపై చేయిచేసుకున్నాడు. దాంతో మనవడు తన తండ్రి జయంతికి ఫోన్ చేసి తాత కొట్టిన విషయం చెప్పాడు. వెంటనే జయంతి ఆదివారం రాత్రే తాను పనిచేసే ప్రాంతం నుంచి సొంతూరుకు వచ్చాడు. తండ్రితో గొడవపడి తీవ్రంగా కొట్టాడు. ఆ తర్వాత అంతా నిద్రపోయారు. తెల్లవారుజామున లేచి చూసేసరికి వెస్టా మృతిచెంది ఉన్నాడు.
గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, తాను తండ్రితో గొడవపడి చేయి చేసుకున్న మాట వాస్తవమేనని, కానీ చంపాలని మాత్రం భావించలేదని నిందితుడు పోలీసులకు తెలిపాడు. మరుసటి రోజు ఉదయం తన తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్దామనుకున్నానని చెబుతూ విలపించాడు.