బాలీవుడ్ చిత్రసీమలోని బంధుప్రీతి, మాఫియా రాజకీయాలపై గత రెండేళ్లుగా తీవ్రమైన చర్చ జరుగుతున్నది. తారల వారసులకు ఇండస్ట్రీలో పెద్దపీట వేస్తారని, బయటినుంచి వచ్చిన వారు హిందీ చిత్రసీమలో నిలదొక్కుకోవడం చాలా కష్టమైన భావన నెలకొంది. ఈ వివాదాలపై అగ్ర కథానాయిక తాప్సీ తనదైన శైలిలో స్పందించింది. ఆమె మాట్లాడుతూ ‘చిత్రసీమలో ఇన్సైడర్స్, అవుట్సైడర్స్ అనే విభజన గురించి నేను ఎక్కువగా మాట్లాడదలచుకోలేదు. ఎవరికైనా ఇక్కడ విజయాలు సాధించడమే ప్రధానంగా ఉంటుంది. వారసులు తప్పకుండా విజయం సాధిస్తారనే గ్యారంటీ ఏమీ లేదు. పరిశ్రమ విషయంలో ప్రేక్షకులే అంతిమనిర్ణేతలు. ఎవరో సహాయం చేస్తారనే భావనతో కాకుండా ఉత్తమ కథల్ని ఎంచుకొని ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఇలాంటి వివాదాలకు తావు ఉండదు. ప్రేక్షకులు నన్ను ఆదరించారు కాబట్టే ఈ స్థాయికి వచ్చాను’ అని చెప్పింది. ఈ అమ్మడి వ్యాఖ్యలు బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం తాప్సీ తెలుగులో ‘మిషన్ ఇంపాజిబుల్’ చిత్రంలో నటిస్తోంది.