హైదరాబాద్ : హైదరాబాద్లో నాలుగు నెలల బాలుడి కిడ్నాప్.. పోలీసులను అర్ధరాత్రి నుంచి తెలవారు జాము వరకు ఉరుకులు, పరుగులు పెట్టించింది. చివరకు ఓ ఇసుకకుప్ప వద్ద బాలుడు ఉండటంతో కిడ్నాప్ టెన్షన్ సుఖాంతం అయ్యిం ది. ఆ బాలుడిని వారి తల్లిదండ్రులకు అప్పగించడంతో.. ఆ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. అయితే బాలుడిని ఎవరు కిడ్నాప్ చేశారు?.. ఎందుకు చేశారు?.. కిడ్నాప్ చేసిన వ్యక్తి తిరిగి ఇసుక కుప్పలోఎందుకు వదిలి వెళ్లాడనే అంశాలు ఇంకా సస్పెన్స్. వివరాల్లోకి వెళ్లితే….మహారాష్ట్రకు చెందిన మనోహర్.. కుటుంబంతో కలిసి లింగంపల్లి తుల్జాభవానీ దేవాలయం వెనకాల ఉన్న నిర్మాణంలో తాత్కాలిక గడిసె వేసుకుని ఉంటున్నాడు. ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటలకు తల్లిదండ్రుల మధ్యలో పడుకున్న 4 నెలల బాబు ప్రభాస్ను గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. కొద్ది సేపటి తర్వాత గుర్తించిన తల్లిదండ్రులు సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాబు కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఆ మార్గాన ఉన్న సీసీ కెమెరాలను వీక్షించగా ఓ వ్యక్తి దుప్పటి కప్పుకుని వచ్చి బాబును ఎత్తుకెళ్తున్న దృశ్యం కనపడింది. దీంతో కిడ్నాప్గా గుర్తించిన పోలీసులు గాలింపును తీవ్రం చేశారు. సరైన క్లూ దొరకక ఇతర కోణాల్లో ఆరా తీసే సమయంలో ఉదయం 7 గంటల ప్రాంతంలో హూడా కాలనీ సాయిబాబా దేవాలయం వద్ద ఓ ఇసుక కుప్ప వద్ద చిన్న పిల్లాడు ఉన్నాడని సమాచారం వచ్చిం ది. వెంటనే అక్కడికి వెళ్లి బాబును తీసుకుని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. బాబు దొరకడంతో ఆ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. ఇక పోలీసులు కూడా ఊపీరి పీల్చుకుని బాబును ఎత్తుకెళ్లిన వ్యక్తి కోసం ఆరా తీస్తున్నారు. తాగిన మత్తులో చేశాడా?.. లేదా ఆ కుటుంబం మీద కక్షతో చేశాడా?.. బాలుడిని ఎత్తుకెళ్లి ఎవరికైనా అమ్మేద్దామని అనుకున్నాడా?.. అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. బాలుడిని ఎత్తుకెళ్లిన వ్యక్తి దొరికితేనే జవాబు దొరుకుతుందని పోలీసులు తెలిపారు.