చంపాపేట, ఏప్రిల్ 14 : ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలో ప్రత్యేక ప్రణాళికలతో ముంపు సమస్యకు శాశ్వత ముగింపు పలుకుతామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. బుధవారం లింగోజిగూడ డివిజన్ తపోవన్ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావుతో కలిసి వివరాలను వెల్లడించారు. ముంపు సమస్య పరిష్కారానికి రూ.103కోట్లతో బాక్స్టైప్ డ్రైన్ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ముంపు సమస్య పునరావృతం కాకుండా అధికారులతో సమగ్ర ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు.
చంద్రగార్డెన్, వంగ శంకరమ్మ గార్డెన్ నుంచి వచ్చే వరద నీరు చంపాపేట డివిజన్ నుంచి లింగోజిగూడ డివిజన్లో ఉన్న లోతట్టు ప్రాంతాలకు వస్తున్నాయని తెలిపారు. జిల్లెలగూడ నుంచి వచ్చే వరద, మురుగునీరు పోవడానికి 8ఫీట్ల వెడల్పుతో శివసాయి కాలనీ, చంద్రగార్డెన్, సింగిరెడ్డి శివారెడ్డి గార్డెన్, ఉదయ్నగర్, మల్రెడ్డి రంగారెడ్డినగర్, మెగా ఫంక్షన్హాల్, శ్రీనివాసకాలనీ, తపోవన్ కాలనీ గుండా సరూర్నగర్ చెరువులో కలవకుండ పక్కనున్న ప్రియదర్శిని పార్క్ నుంచి సరూర్నగర్ చౌడి, జోనల్ కమిషనర్ కార్యాలయం, పండ్ల మార్కెట్, చైతన్యపురి గుండా మూసినాలాకు అనుసంధానం చేసే విధంగా పైప్లైన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
రూ.28కోట్లతో వంగ శంకరమ్మ గార్డెన్ నుంచి ప్రత్యేక డ్రైన్ తీసుకొచ్చి ఉదయ్నగర్ కాలనీలోని నాలాకు అనుసంధానం చేసే పనులను త్వరలో ప్రారంభిస్తామని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో చేపట్టిన బాక్స్టైప్ డ్రైన్ పనులు తుదిదశకు చేరుకున్నాయని పేర్కొన్నారు. సాయినగర్ కాలనీలో 6ఫీట్ల దారి ఇచ్చే విధంగా ఒప్పించామని తెలిపారు. డివిజన్లో ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాలు డివిజన్ ప్రజలపై ఎనలేని ప్రేమ చూపిస్తున్నాయని అన్నారు. సమావేశంలో లింగోజిగూడ టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు తిలక్రావు, నాయకులు బెల్దె నర్సింహ గుప్తా, మధుసాగర్, ప్రవీణ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.