‘సినీరంగంలో ఫలానా స్థాయికి చేరుకోవాలనే లక్ష్యాలేవీ పెట్టుకోలేదు. ఇండస్ట్రీలోని ఇతర హీరోలతో అస్సలు పోల్చిచూసుకోను’ అని చెప్పారు యువ హీరో సుశాంత్. గతకొంతకాలంగా సినిమాల ఎంపికలో పంథా మార్చుకున్న ఈ అక్కినేని కుటుంబ హీరో ప్రస్తుతం కథల్లో కొత్తదనానికే తన తొలి ప్రాధాన్యత అంటున్నారు. ఆయన కథానాయకుడిగా ఎస్.దర్శన్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రం నేడు ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం సుశాంత్ పాత్రికేయులతో పంచుకున్న విశేషాలివి..
సొంత నిర్ణయాలు తీసుకుంటున్నా
కెరీర్పరంగా నేను ఎలాంటి ప్రణాళికలు వేసుకోను. నా దగ్గరకు వచ్చిన కథల్లో అత్యుత్తమంగా అనిపించిన వాటిని ఎంచుకొని సినిమాలు చేస్తున్నా. పరిశ్రమలో మనం ఏం చేసినా స్వతంత్య్ర వ్యక్తిత్వం, నిర్ణయాలతో ముందుకుసాగాలని మామయ్య నాగార్జున చెప్పారు. అలా చేసినప్పుడే సినిమాలపరంగా నిజమైన సంతృప్తి ఉంటుందని సలహా ఇచ్చారు. మావయ్య సలహాను పాటిస్తూ కథల ఎంపికలో సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నా.
లైవ్ చూసిన అనుభవం
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ కథ వినగానే బాగా కనెక్ట్ అయిపోయా. కథ చెబుతున్నప్పుడు కాలనీలో జరిగే సంఘటనలు, వ్యక్తుల్ని లైవ్లో చూస్తున్న అనుభూతి కలిగింది. ఈ కథలో సంక్లిష్టమైన అంశాలు ఏవీ ఉండవు. వాస్తవానికి దగ్గరగా ఉంటూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.
కొత్త సుశాంత్ను చూశామన్నారు
కరోనా ప్రభావంతో వచ్చిన రెండు లాక్డౌన్స్ వల్ల సినిమా విడుదల చాలా ఆలస్యమైంది. అయితే థియేటర్లో మాత్రమే చూడాల్సిన సినిమా అనే నమ్మకంతో అందరం నిరీక్షించాం. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ఇదే బెస్ట్ పర్ఫార్మెన్స్గా భావిస్తున్నా. సినిమాలో కొత్త సుశాంత్ కనిపించాడని సన్నిహితులు ప్రశంసించారు.
నా తదుపరి చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో చేయడానికి సన్నాహాలు చేస్తున్నా. కథ దాదాపుగా ఖరారైంది. నా పెళ్లి విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంట్లో వాళ్లు కూడా ఒత్తిడి చేయడం లేదు.