హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): ‘జననీ జన్మభూమిశ్చ.. స్వర్గాదపి గరీయసి’ అన్నట్టు మనం నివసిస్తున్న ప్రాంతంపై అభిమానాన్ని పెంచుకుని, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉంచుతూ కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి తెలంగాణ పౌరుడూ ప్రతినబూనాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు హరితహారంతో రాష్ట్రం పచ్చగా మారుతున్నదని, పల్లెప్రగతి, పట్టణప్రగతిలో భాగంగా పరిశుభ్రత పచ్చదనం కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతున్నాయని సీఎం తెలిపారు.
తాగు,సాగునీరు లేక అల్లాడిన తెలంగాణ నేలలో నేడు అడుగడుగునా జీవజలం ప్రవహిస్తున్నదని పేర్కొన్నారు. చెరువులు, కుంటలు నిండి భూగర్భ జలాలు సమృద్ధిగా పెరిగాయని.. తద్వారా పంటలకు, మనుషులకే కాకుండా పశుపక్షాదులకు మేలుజరిగి తెలంగాణలో ప్రకృతి సమసతుల్యత సాధించగలిగామని తెలిపారు. పర్యావరణంపై పెరిగిన అవగాహన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్ర ప్రజల్లో పచ్చదనం, పరిశుభ్రత, నీటివినియోగంతోపాటు ప్రకృతి వనరుల పరిరక్షణ.. తద్వారా ధరిత్రి రక్షణపై అవగాహన పెరగడం శుభసూచకమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
విశ్వవ్యాప్తంగా వాతావరణ మార్పుల కారణంగా మానవజాతికి రోజురోజుకూ తలెత్తుతున్న కీడు మనిషి స్వయంకృపారాధమనే విషయాన్ని ఇప్పటికైనా గ్రహించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. ధరిత్రికి పొంచిఉన్న ప్రమాదాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. మన పిల్లలకోసం డబ్బు సంపాదించడం, ఆస్తులు కూడబెట్టడం మాత్రమే కాదని.. ధరిత్రి సంరక్షణ పట్ల కూడా బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. అప్పుడే బంగారు భవిష్యత్కు బాటలు వేసిన వారమవుతామని పేర్కొన్నారు.
స్వీయ జాగ్రత్తలే శ్రీరామ రక్ష: మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
కరోనా వైరస్ మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి స్వీయ జాగ్రత్తలే శ్రీరామ రక్ష అని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు. గురువారం అరణ్యభవన్లో ప్రపంచ ధరిత్రి దినోత్సవం (వరల్డ్ ఎర్త్ డే) నిర్వహించారు. అనంతరం ప్రత్యేక కొవిడ్ వాక్సినేషన్ సెంటర్ను మంత్రి అల్లోల ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అజాగ్రత్తకు చోటివ్వకుండా కొవిడ్ నియమాలను పాటించాలని సూచించారు.
ధరిత్రి దినోత్సవంలో గ్రీన్ ఇండియా చాలెంజ్
ధరిత్రి దినోత్సవం సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ శివార్లలోని ప్రగతి రిసార్ట్లో పెద్దసంఖ్యలో ఔషధ మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ అనే గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి పచ్చదనం పెంచడం కోసం ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారని ప్రగతి రిసార్ట్ చైర్మన్ జీబీకే రావు ప్రశంసించారు. గ్రీన్ఇండియా చాలెంజ్ కోఫౌండర్ రాఘవ, రిసార్ట్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్, డైరెక్టర్ రామకృష్ణ, చీఫ్ పీఆర్వో రవీందర్ పాల్గొన్నారు.