శత్రుదుర్భేద్యమైన రాతి కట్టడాలు
అద్భుతమైన శిల్పకళా సంపద
కనుమరుగవుతున్న నిర్మాణాలకు మరమ్మతులు
తెలంగాణ సర్కారు చొరవతోనే ముందడుగు
కాకతీయుల ఘన కీర్తిని మరింత పెంచేలా చర్యలు
చారిత్రక సంపదకు మెరుగులు
ఖిలావరంగల్, మే 1 : అక్కడ అడుగుపెడితే కాకతీయుల సామ్రాజ్య వైభవం కళ్లముందు కదలాడుతుంది. శత్రుదుర్భేద్యమైన రాతి కోటలు.. అబ్బురపరిచే శిల్పకళా సంపద.. లెక్కకు మించిన పురాతన కట్టడాలు.. ఆలయాలకు ఖిలా వరంగల్ కోటకు పెట్టింది పేరు. అంతటి ప్రాశస్త్యం ఉన్న కోటను ప్రపంచంలోనే అద్భుత ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు స్వరాష్ట్రంలో తెలంగాణ సర్కారుతో ముందడుగు పడింది. ఇందులో భాగంగా కాలగర్భంలో కనుమరుగవుతున్న ఆలయాలు, కట్టడాలకు మరమ్మతులు, భూములు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించడం ద్వారా కాకతీయుల ఘనకీర్తిని మరింత పెంచేందుకు మెరుగులు దిద్దుతున్నది. కోటకు వచ్చే పర్యాటకులు అక్కడి ప్రాముఖ్యతను స్వయంగా తెలుసుకునేందుకు అడుగడుగునా సైన్ బోర్డులు ఏర్పాటుచేయనుంది.
ఖిలా వరంగల్ కోట కాకతీయుల కళా సంపదకు పుట్టినిల్లు. చారిత్రక కట్టడాలకు నెలవు. ఎటు చూసినా అద్భుత శిల్ప కళా వైభవం ఇక్కడి వచ్చే పర్యాటకులకు కనువిందు చేస్తున్నది. దీనిని ప్రపంచంలోనే ఓ అద్భుత పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టింది. అలాగే కేంద్ర పురావస్తు శాఖ ముళ్లపొదల మధ్య కనుమరుగైన ఆలయాలు, చారిత్రక కట్టడాలను ఒక్కొక్కటిగా వెలికి తీసి మరమ్మతులు చేపట్టింది. చారిత్రక కట్టడాలకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా చుట్టూ గోడలు, కంచెలు నిర్మించి గేట్లు ఏర్పాటు చేసింది. పర్యాటకులు ఎవరి సహకారం లేకుండా కోటలో అక్కడక్కడ ఉన్న ఆలయాల వద్దకు నేరుగా వెళ్లేందుకు సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.
కోటలెన్నో..
చరిత్రకారులు ఏడు కోటలున్నట్లు చెబుతున్నప్పటికీ ప్రసుత్తం మనకు కనిపించేవి మూడు కోటలు మాత్రమే. అవి పుట్ట కోట, మట్టి కోట, రాతి కోట. ఇందులో 12.5 కిలోమీటర్ల మేర పుట్ట కోట ఆనవాళ్లు వంచనగిరి, వెంకటాపురం, బొల్లికుంట, కొండపర్తి, మొగిలిచర్ల తదితర గ్రామాల్లో విస్తరించి ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. మట్టి కోట 2.4 కిలోమీటర్ల వ్యాసార్థంతో 7.2 కిలోమీటర్లు శ్రీచక్రాన్ని పోలి ఉంటుంది. ఈ మట్టికోటకు తూర్పు, పడమరన ప్రధాన ద్వారాలు ఉండగా, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యంతోపాటు ఉత్తర, దక్షిణం వైపు కూడా ఈ ద్వారాలు కేవలం కాలినడకకే పనికొచ్చేలా నిర్మించారు. ఇందులో మట్టికోట గర్భంలో ద్వారాలకు అతి సమీపంలో ఎనిమిది త్రికూటాలయాల ఆనవాళ్లు మన కళ్లముందు దర్శనమిస్తున్నాయి. ఇదిలా ఉంటే రాతి కోట 4.5 కిలోమీటర్ల చుట్టూ 1.2 కిలో మీటర్ల వ్యాసార్థంతో ఉంది. ఈ కోటకు తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణంవైపు నాలుగు సింహద్వారాలు ఉన్నాయి. ఈ ద్వారాలు శత్రువులను సైతం అయోమయానికి గురిచేసేవిగా నిర్మించడం విశేషం. అలాగే రాతికోటపై 42 బురుజులు వాటి మధ్య ఫిరంగులతో శత్రుదుర్భేద్యంగా నిర్మించారు.
ఆలయాలు.. కోనేర్లు ఎన్నో..
చారిత్రక నేపథ్యం కలిగిన కోటలో ఆలయాలు.. కోనేర్లు లెక్కలేనన్ని ఉన్నాయి. 365 ఆలయాలు, 365 బావులు(కోనేరులు) ఉండేవని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం కోటలో మాత్రం స్వయంభూ శ్రీ శంభులింగేశ్వరస్వామి ఆలయం, నేల శంభునిగుడి, లక్ష్మీకొండల ఆలయం, భూగర్భంలో ఒక ఆలయంపై వరాలమ్మ ఆలయం, జంగమయ్య గుడి, మండలమ్మ ఆలయం, వేంకటేశ్వర స్వామి, రామలింగేశ్వరస్వామి ఆలయాలు, కొండగుడి, శివాలయంతో పాటు మరో మూడు శిథిలమైన ఆలయాలు, అశ్వశాల పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే గతంలో స్వయంభూ శ్రీ శంభులింగేశ్వరస్వామి ఆలయం మాత్రమే పర్యాటకులకు కనిపించేంది. రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేంద్ర పురావస్తు శాఖ హైదరాబాద్ సర్కిల్ కేంద్రంగా ఒక్కొక్క ఆలయాన్ని ముస్తాబు చేసి పర్యాటకుల ముందుకు తీసుకొస్తున్నది.