హైదరాబాద్ : త్వరలో ప్రారంభమయ్యే ఐపీఎల్ సీజన్ మ్యాచ్లను హైదరాబాద్లో నిర్వహించే అంశాన్ని సానుకూలంగా పరిశీలించాలని చేవేళ్ల టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి పార్లమెంట్ వేదికగా కేంద్రాన్ని కోరారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)14వ సీజన్-2021ను హైదరాబాద్లో నిర్వహించకపోవడం హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ని షాక్ కు, నిరాశకు గురి చేసిందని లోక్సభ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలో అత్యంత తక్కువ కేసులున్న హైదరాబాద్ నగరం మ్యాచ్లు నిర్వహించేందుకు ఎంతో సురక్షితం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న పకడ్బందీ కొవిడ్-19 కట్టడి చర్యల కారణంగా దేశంలోని మిగిలన మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్లో అతి తక్కువ కేసులు నమోదైన విషయాన్ని ఎంపీ ఈ సందర్భంగా గుర్తుచేశారు.
హైదరాబాద్ను వేదికగా ఎన్నుకోకపోవడం హెచ్సీఏకు భారీ నష్టాన్ని కల్గిస్తుందన్నారు. ఇలాంటి నిర్ణయాల వల్ల తెలంగాణ నుండి వచ్చే వర్ధమాన క్రికెట్ ప్రతిభకు హాని కలిగిస్తుందన్నారు. లీగ్ నిర్వహణకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ఇప్పటికే బీసీసీఐ, ఐపీఎల్కు అప్పీల్ చేసిన విషయాన్ని ఎంపీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.