కేవలం తెలుగు ఇండస్ట్రీ లోనే కాదు.. ఇంకా చాలా ఇండస్ట్రీలలో ఎన్నో సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పదుల సంఖ్యలో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడడానికి రెడీ అవుతున్నాయి. ఒకసారి నార్మల్ పరిస్థితులు వస్తే వారానికి ఎన్ని సినిమాలు పోటీ పడతాయో ఊహించడం కష్టం. అందులో పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి.
ఒకేసారి రెండు మూడు సినిమాలు వస్తే కచ్చితంగా థియేటర్ల సమస్య వస్తుంది. పైగా వైరస్ నుంచి పరిస్థితులు కుదుటపడిన తర్వాత ప్రేక్షకులు ముందులా థియేటర్లకు వస్తారా..? రారా? అనేది కూడా అనుమానమే. ఇన్ని అనుమానాల మధ్య కొందరు నిర్మాతలు తమ సినిమాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు.
థియేటర్ల కోసం కొట్టుకునే కంటే హాయిగా డిజిటల్ లో విడుదల చేసుకుంటే మంచిది అని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ ఫాలో అయిన పద్ధతిని కొందరు నిర్మాతలు తెలుగులో కూడా అప్లై చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలు నేరుగా ఓటీటిలో విడుదల చేశారనే పేరు రాకుండా..ఒకేసారి థియేటర్, ఆన్ లైన్ విడుదలకు సిద్ధం చేస్తున్నారు.
మొన్న సల్మాన్ ఖాన్ ప్రభుదేవా రాధే అలాగే వచ్చింది. అయితే సినిమా విడుదల సమయానికి లాక్ డౌన్ విధించడంతో కేవలం ఆన్ లైన్ లోనే విడుదలైంది. ఈ సినిమా కోసం పే ఫర్ వ్యూ పద్ధతి ఎంచుకున్నాడు సల్మాన్ ఖాన్.అవసరం అనుకున్న వాళ్లు థియేటర్ కు వచ్చి సినిమా చూడొచ్చు. అందుబాటులో లేని వాళ్ళు టికెట్ కొని ఇంట్లోనే సినిమాను చూడొచ్చు. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా కూడా ఇలాగే విడుదలవుతుందని ప్రచారం జరుగుతుంది. దేవా కట్ట తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా రోజులు అయిపోయింది.
పొలిటికల్ ఎంటర్టైనర్ గా సినిమాను తెరకెక్కించాడు దేవాకట్ట. ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు మెగా మేనల్లుడు. పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో చక్కబడేలా కనిపించడం లేదు. అందుకోసమే రాధే సినిమా మాదిరే రిపబ్లిక్ కూడా ఓటిటీ కం థియేటర్స్ లో ఒకేసారి విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. సాయి ధరమ్ తేజ్ గత సినిమా సోలో బ్రతుకే సో బెటర్ కూడా థియేటర్లలో విడుదలైన వారానికి ఓటిటీ ప్లాట్ ఫామ్ లో వచ్చేసింది.