‘ఈసారి ‘మా’ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. నిజాయితీగా పనిచేసే వారికే పట్టం కడతా రన్న విశ్వాసముంది’ అని అన్నారు సురేష్ కొండేటి. సినీ జర్నలిస్ట్, నిర్మాతగా తెలుగు చిత్రసీమలో అందరికి సుపరిచితుడైన ఆయన ఈ నెల 10న జరగనున్న ‘మా’ ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా పోటీ చేస్తున్నారు. గత మూడు పర్యాయాలుగా ‘మా’లో ఈసీ మెంబర్గా సేవలందిస్తున్న ఆయన ఈ దఫా కూడా విజయంపై ధీమాతో ఉన్నారు. నేడు సురేష్ కొండేటి జన్మదినం. ఆయన మాట్లాడుతూ ‘చిత్రసీమలో మూడుదశాబ్దాలుగా ప్రయాణం సాగిస్తున్నా. ప్రతి ఏడాది ‘సంతోషం’ అవార్డ్స్ను నిర్వహిస్తున్నాం. కొవిడ్ కారణంగా గత రెండేళ్లుగా వేడుకల్ని నిర్వహించలేదు.
నవంబర్ 14న భారీస్థాయిలో సంతోషం అవార్డ్స్కు ప్లాన్ చేస్తున్నాం. గత ‘మా’ ఎన్నికల్లో నాకు 264 ఓట్లు వచ్చాయి. ‘మా’ నుంచి ఒక్కరూపాయి కూడా తీసుకోలేదు. ప్రతి ఏడాది పేద కళాకారులకు సంతోషం అవార్డు వేడుకలో నగదు అందచేస్తున్నా. నన్ను ఉన్నతంగా తీర్చిదిద్దిన సినీ రంగానికి సేవ చేయాలనే తలంపుతో ఉన్నా. ‘దేవినేని’చిత్రంలో సెకండ్లీడ్ హీరోగా మంచి గుర్తింపు లభించింది. ఇక నుంచి నటుడిగా మంచి పాత్రలు చేయాలని ఉంది. దర్శకత్వం కూడా చేయాలనే ఆలోచనతో ఉన్నా. నా కలల సాకారం వైపు అంకితభావంతో సాగిపోతున్నా’ అన్నారు.