హైదరాబాద్ : ప్రముఖ హీరో, సూపర్ స్టార్ కృష్ణ తన జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్ ద్వార తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి వారు ఇచ్చిన పిలుపుమేరకు ఈరోజు నానక్ రామ్గూడలోని తన నివాసంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా కృష్ణ మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా హీరో కృష్ణ మాట్లాడుతూ.. పచ్చదనాన్ని పెంచుతూ పర్యావరణాన్ని పరిరక్షించడం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి పచ్చదనం పెంచడం కోసం ప్రజల్లో చైతన్యం తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. అతను చేస్తున్న కృషికి నేను మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. గతంలో కూడా నేను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం జరిగింది అని కృష్ణ తెలిపారు.