యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి): యాసంగి సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లకు తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. గత సీజన్లో కరోనా ఉన్నప్పటికీ రికార్డు స్థాయిలో ధాన్యాన్ని సేకరించగా.. ఈసారి కూడా అదే స్థాయిలో కొనుగోళ్లు జరిపేలా చర్యలు తీసుకుంటోంది. పంటల సాగుకు అనుకూల పరిస్థితులు నెలకొనడంతో నియంత్రిత సాగు విధానంలో భాగంగా రైతులు వరిని సాగు చేశారు. బీడు భూములు సైతం సాగులోకి వచ్చాయి. బోరు, బావుల్లోనూ భూగర్భజలాలు భారీగా ఉండటంతో పంటల దిగుబడులకు సైతం ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోయింది. జిల్లాలో ఇప్పటికే అక్కడక్కడా వరి కోతలు జోరందుకున్నాయి. అమ్మేందుకు సిద్ధంచేసి ఉంచిన ధాన్యాన్ని రైతులు ఆరబెట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. కొన్నిచోట్ల కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలివస్తోంది. ఈ పరిస్థితుల్లో పండించిన ప్రతి గింజను కొనేందుకు ప్రభుత్వం సిద్ధపడగా జిల్లా యంత్రాంగం అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసింది.
ఈసారి 288 కేంద్రాలు ఏర్పాటు
గత యాసంగిలో భారీ ఎత్తున ధాన్యం దిగుబడులు రావడంతో రైతులు ఇబ్బందులు పడకుండా 260 వరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. గ్రామాల్లోనే కాంటాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసింది. 3.18లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేసి రూ.502కోట్లకు పైగా రైతులకు చెల్లించింది. ఈసారి యాసంగి పంటల సాగుకు అనుకూల పరిస్థితులు నెలకొనడంతో 2.40లక్షల హెక్టార్లలో వరిని రైతులు సాగు చేయగా.. 4.80లక్షల మెట్రిక్ టన్నుల వరకు వరి దిగుబడులు వస్తాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లా అవసరాల మేరకు 3.70లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. అంతకుమించి ధాన్యం వచ్చినా కొనుగోలు చేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం గ్రేడ్-ఏ రకానికి రూ.1,888, గ్రేడ్-బీ రకానికి రూ.1,868 చెల్లించి రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది.
వడ్ల కొనుగోళ్ల కోసం జిల్లాలో 288 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 98 కేంద్రాలను ఐకేపీ ఆధ్వర్యంలో, 186 కేంద్రాలను పీఏసీఎస్ల ఆధ్వర్యంలో, మరో 4 కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా 44లక్షల గన్నీ బ్యాగులను సైతం అందుబాటులో ఉంచారు. వర్షం పడితే ధాన్యం తడవకుండా ఉండేందుకు టార్పాలిన్లను అందుబాటులో ఉంచడంతోపాటు కేంద్రాల వద్ద తాగునీరు, నీడ సౌకర్యం కల్పిస్తున్నారు. శుక్రవారం భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి పీఏసీఎస్, నమత్పల్లి పీఏసీఎస్, మోటకొండూరు మండలం వంగపల్లి పీఏసీఎస్లల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. శనివారం చాడ, నాంచారిపేట్, పటేల్గూడ, కొల్లూరు, పులిగిళ్ల, జనక్పల్లిలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు.
దళారులను నమ్మి మోసపోవద్దు
మోటకొండూర్, ఏప్రిల్ 9: అరుగాలం కష్టించి పండించిన పంటలను రైతులు దళారులకు విక్రయించి మోసపోవద్దని వంగపల్లి పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎగ్గిడి బాలయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో పీఏసీఎస్ వంగపల్లి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ పైళ్ల ఇందిరతో కలిసి ఆయన ప్రారంభించారు.ఆలేరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ అనంతుల జంగారెడ్డి, రైతు బంధు సమితి కన్వీనర్ అయిలయ్య, సర్పంచ్ వడ్డెబోయిన శ్రీలత, మండల ఏవో సుబ్బూరి సుజాత, ఏఈవో ప్రణయ్రెడ్డి, ఉప సర్పంచ్ రేగు శ్రీనివాస్, రైతులు సిద్ధులు, పన్నాల బుచ్చిరెడ్డి, వీరమల్లేశ్ పాల్గొన్నారు.
ఇవీ కూడా చదంవడి…
గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేయాలి
ప్రైవేటు ఉపాధ్యాయులకు అండగా ప్రభుత్వం