న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కరోనా సంక్షోభం దేశాన్ని పట్టిపీడిస్తున్నప్పటికీ పరోక్ష పన్నులుగా పిలిచే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ), కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాల వసూళ్లు భారీగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో మొత్తం రూ.10.71 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వసూలైన రూ.9.54 లక్షల కోట్లతో పోలిస్తే ఈ మొత్తం 12.3 శాతం ఎక్కువ. అంతేకాకుండా బడ్జెట్లో సవరించిన అంచనా (రూ.9.89 లక్షల కోట్ల) కంటే కూడా ఈ వసూళ్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. వీటిలో జీఎస్టీ ద్వారా రూ.5.48 లక్షల కోట్లు, కస్టమ్స్ సుంకాల ద్వారా రూ.1.32 లక్షల కోట్లు, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ (బకాయిల) ద్వారా రూ.3.91 కోట్లు వసూలైనట్లు ఆర్థిక శాఖ మంగళవారం ప్రకటించింది. 2019-20లో వచ్చిన రూ.5.99 కోట్లతో పోలిస్తే ఈసారి జీఎస్టీ వసూళ్లు 8 శాతం తగ్గాయని వెల్లడించింది. అయితే గతంలో రూ.1.09 లక్షల కోట్లుగా ఉన్న కస్టమ్స్ సుంకం వసూళ్లు ఈసారి 21 శాతం.. సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ వసూళ్లు 59.2 శాతం (రూ.2.45 లక్షల కోట్ల నుంచి రూ.3.91 లక్షల కోట్లకు) పెరిగినట్లు వివరించింది.
ఇదీ లెక్క..
జీఎస్టీ రూ.5.48 లక్షల కోట్లు
కస్టమ్స్ సుంకాలు రూ.1.32 లక్షల కోట్లు
సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ రూ.3.91 లక్షల కోట్లు
సీబీఐసీ చైర్మన్ అజిత్ కుమార్
ఇంధన ధరలను తగ్గించేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నదని, సమయం వచ్చినప్పుడు పెట్రోల్, డీజిల్పై ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తుందని కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ సుంకాల బోర్డు (సీబీఐసీ) చైర్మన్ ఎం అజిత్ కుమార్ తెలిపారు. పెట్రోల్, డీజిల్పై రికార్డు స్థాయిలో సుంకాన్ని విధించడం ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో పరోక్ష పన్ను వసూళ్లు 59 శాతానికిపైగా పెరిగాయన్నారు. పన్ను వసూళ్ల గణాంకాలను వివరించేందుకు మంగళవారం ఆయన వీడియో కాల్ ద్వారా పాత్రికేయులతో మాట్లాడుతూ.. మున్ముందు ప్రభుత్వ ఆదాయం మరింత పెరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కేంద్రం గతేడాది లీటర్ పెట్రోల్పై రూ.13, డీజిల్పై రూ.16 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని పెంచిన విషయం విదితమే. దీంతో లీటర్ పెట్రోల్పై ఎక్సైజ్ సుంకం రూ.32.90కి, డీజిల్పై రూ.31.80కి చేరింది. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.90.56, డీజిల్ రూ.80.87 ధర పలుకుతున్నది.