సన్నీ నవీన్, రోహిణీ రేచల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘జైత్ర’. ఎయిమ్స్ మోషన్ పిక్చర్స్, ఎస్కే ఫిలింస్ పతాకాలపై సురేష్ కొండేటి, అల్లం సుభాష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో తోట మల్లికార్జున దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్లో జరిగింది.
దర్శకుడు వెంకీ కుడుముల ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘మల్లికార్జున ‘ఛలో’ చిత్రానికి నా దగ్గర పనిచేశాడు. మంచి సినిమా చేశాడనే భావిస్తున్నా’ అన్నారు. ‘రాయలసీమలో జోడెద్దులు, నాలుగు ఎకరాల భూమి ఉన్న భాగ్యవంతుడి కథ ఇది.’ అని దర్శకుడు మల్లికార్జున తెలిపారు. నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ..‘గతంలో ‘ప్రేమిస్తే’, ‘జర్నీ’, ‘పిజ్జా’ వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించాను. దర్శకుడు ఈ కథ చెప్పగానే ఇదీ అలాంటి విజయమే సాధిస్తుందనిపించింది’ అన్నారు.