హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధిపై దృష్టి సారించిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత స్పష్టం చేశారు. శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా దేవాదాయ శాఖ భూములు, ఇతర అంశాలపై ఎమ్మెల్యే సునీత మాట్లాడారు. గత ప్రభుత్వాల పాలనలో దేవాదాయ శాఖకు చెందిన భూములు కబ్జాకు గురయ్యాయి. ఇప్పుడు దేవాదాయ భూములను కాపాడుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ర్టంలోని దేవాలయాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించామన్నారు.
దీప దూప నైవేద్యాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించామన్నారు. ఈ పథకం కింద పూజారులకు రూ. 6 వేలు ఇస్తున్నామని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలోనూ ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయమన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని దేవాలయాల అభివృద్ధి జరుగుతుందన్నారు. నిత్యం స్వామికి వారికి కైంకర్యాలు చేసేవారికి, ఇతర పూజారులకు ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా జీతాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమన్నారు.
యాదాద్రిని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. భవిష్యత్లో యాదాద్రి గొప్ప కట్టడంగా మారనుందని ఆమె పేర్కొన్నారు. మూడు సంవత్సరాల కాలంలోనే యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణ పనులు పూర్తి చేయడం గొప్ప విషయమని ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు.