కొండాపూర్, మే 26: విశ్వమానవాళి ఎదుర్కొంటున్న కరోనా సమస్యను అధిగమించేందుకు సమిష్టి కృషి అవసరమని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. కేవలం ఓ వ్యక్తి, సంస్థ, ప్రభుత్వంతో కరోనా మహమ్మారి అంతం సాధ్యమయ్యేది కాదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కోటి వ్యాక్సిన్ల కోసం టెండర్లను ఆహ్వానించినట్టు తెలిపారు. బుధవారం హైదరాబాద్ మాదాపూర్లోని పత్రికానగర్లో ఐటీ ఇండస్ట్రీ యునైటెడ్ వే, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆశ్రయ్ మెడికల్ కొవిడ్ కేర్ సెంటర్ పేరిట ఏర్పాటుచేసిన కేంద్రంలో ఐసీయూ పడకలను ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నదవాఖానలకు నోటీసులు జారీచేశామని, త్వరలోనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలోని పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఎప్పటికప్పుడు కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చిస్తున్నదని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేదిశగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. మొదటి వేవ్ లో ఐటీ ఇండస్ట్రీ యునైటెడ్ వే ఆధ్వర్యం లో రూ.80 కోట్ల విలువైన వైద్య పరికరాలను ప్రభుత్వానికి అందించారని, ఇప్పు డు మరోసారి ఎక్కువమందికి సేవ చేసేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉన్నదని చెప్పారు. కొవిడ్ సెంటర్ ఏర్పాటుకు ప్రత్యేక కృషి చేసిన సైబరాబాద్ సీపీ సజ్జనార్, ఎస్సీఎస్సీ, హైసియా, యునైటెడ్ వే ప్రతినిధులను అభినందించారు. భవిష్యత్తు ప్రణాళికలపై ఐటీ సంస్థలతో మరోసారి సమావేశమవనున్నట్టు తెలిపారు. ప్రపంచంలోని ఐటీ సంస్థలు రాష్ర్టానికి అందించే సహకారంపై చర్చిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కే నవీన్కుమార్, యునైటెడ్ వే చైర్మన్ రమేశ్, హైసియా చైర్మన్ భరణి, రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్, జోనల్ కమిషనర్ రవికిరణ్, ఎస్సీఎస్సీ ప్రతినిధి కృష్ణ ఏదుల, వివిధ సాఫ్ట్వేర్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆశ్రయ్ కొవిడ్ సెంటర్లో 6 ఐసీ యూ, 100 సాధారణ పడకలు అందుబాటులో ఉన్నాయి. 20 మంది వైద్యులు, 50 మంది నర్సులు, 100 మంది సిబ్బం ది 24/7 వైద్యసేవలు అందిస్తున్నారు. ఇప్పటికే 130 మంది కోలుకోగా, 36 మంది చికిత్స పొందుతున్నారు. ఔషధాలు, ఆక్సిజన్ను సైబరాబాద్ సీపీ సజ్జనార్ ద్వారా సమకూరుస్తున్నారు. పలు సాఫ్ట్వేర్ సంస్థలు అందించిన విరాళాల ద్వారా ఈ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ సేవలు పూర్తిగా ఉచితం. కొవిడ్ స్వల్ప లక్షణాలతో ఉన్న బాధితులు చికిత్స పొందాలంటే ఆరోగ్య శ్రీ లేదా ఆరోగ్యభద్రత కార్డులు తప్పనిసరిగా తీసుకెళ్లాలి.