కరోనా బెడద ఇప్పట్లో తప్పేలా లేదు. ఒక వేవ్ తగ్గుముఖం పడుతుందని అనుకుంటున్న వేళ మరో వేవ్ మనల్ని వణికించడానికి సిద్ధమవుతుంది. ప్రస్తుతం కొన్ని చోట్ల డెల్టా ప్లస్ కేసులు వణుకు పుట్టిస్తున్నాయి. తాజాగా దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి అపార్ట్మెంట్స్లో కరోనా కలకలం సృష్టించింది. దీంతో మున్సిపల్ అధికారులు ఆ అపార్ట్మెంట్ను సీజ్ చేశారు. కరోనా నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీఎంసీ అధికారులు తెలిపారు.
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముంబై, మౌంట్ రోడ్లోని పృథ్వీ అపార్ట్మెంట్స్లోని 18వ ఫ్లోర్లో తన ఫ్యామిలీతో ఉంటున్నారు. అయితే ఆ అపార్ట్మెంట్లో ముగ్గురికి డెల్టా వేరియెంట్ సోకినట్టు వైద్య బృందం గుర్తించింది. దీంతో కేసుల విస్తరణను అడ్డుకునే ప్రయత్నంలో ఆ భవన సముదాయాన్ని మొత్తం కూడా సీజ్ చేశామని బీఎంసీ అసిస్టెంట్ కమిషనర్ ప్రశాంత్ గైక్వాడ్ తెలిపారు. అయితే అపార్ట్మెంట్ సీజ్ చేయడంతో సునీల్ శెట్టి ఆయన భార్య, కూతురు, హీరోయిన్ అతియాశెట్టి, కుమారుడు అహాన్ శెట్టి వేరు ప్రాంతానికి వెళ్లినట్టు సమాచారం.