‘నటనపరంగా నయనతార నాకు స్ఫూర్తి. ఆమెలా అభినయానికి ఆస్కారమున్న విలక్షణ పాత్రల్లో నటించాలనే కోరిక ఉంది. ఈ సినిమా ద్వారా ఆ కల కొంత నెరవేరింది’ అని చెప్పింది పూర్ణ. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సుందరి’. రిజ్వాన్ నిర్మాత. కల్యాణ్ జీ గోగన దర్శకుడు. ఈ నెల 13న ఈ చిత్రం విడుదలకానుంది. ఆదివారం హైదరాబాద్లో చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘అమాయకురాలైన సుందరి అనే పల్లెటూరి యువతి కథ ఇది. ఎదుటివారితో మాట్లాడటానికే భయపడే ఆమె సమాజాన్ని ఎదురించి పోరాడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందన్నది ఈ చిత్ర ఇతివృత్తం. సంభాషణల కంటే హావభావాలతోనే పూర్ణ చక్కటి నటనను కనబరిచింది’ అని తెలిపారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదలచేస్తున్నామని నిర్మాత అన్నారు. పెద్ద హీరోయిన్స్ చేసే పాత్రను తనపై నమ్మకంతో దర్శకనిర్మాతలు ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నానని పూర్ణ చెప్పింది. ఈ కార్యక్రమంలో రాకేందుమౌళి, సురేష్ బొబ్బిలి, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.