న్యూఢిల్లీ: భారత సరిహద్దుల్లో కాల్పుల ఘటనలు తగ్గాయని, కానీ పాకిస్థాన్ నుంచి డ్రోన్ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు త్రివిధదళాల చీఫ్ బిపిన్ రావత్ తెలిపారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద కాల్పులు నిలిచిపోయాయని, ఇది పాజిటివ్ సంకేతమని, కానీ ఇదే సమయంలో డ్రోన్ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు తేలిందన్నారు. డ్రగ్స్, వెపన్స్ వల్ల అంతర్గత శాంతి దెబ్బతింటుందని రావత్ తెలిపారు. ఉగ్రవాదం వైపు మళ్లుతున్న కశ్మీరీ యువతను రక్షించుకోవాలన్నారు. కశ్మీరీ యువతను గుర్తించి, ఉగ్రవాదం వల్ల జరిగే నష్టాల గురించి వారికి తెలియచెప్పాలన్నారు. త్రివిధ దళాలను ఏకీకరించే ప్రయత్నం జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. మూడు రక్షణ దళాలు ఒక్కటైతే, భవిష్యత్తులో మనం దేన్నైనా ఎదుర్కొనే అవకాశం ఉంటుందన్నారు.