సంక్షేమానికి అధిక ప్రాధాన్యం
ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగాలి
రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్
దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్ల పంపిణీ
ధర్మపురి, ఏప్రిల్ 17: దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిపెట్టిన ఏకైక రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమే అని, ఆది నుంచి అండగా ఉంటున్నదని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈ శ్వర్ ఉద్ఘాటించారు. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగాలని సూచించారు. శనివారం ధర్మపురి ఏఎంసీ ప్రాంగణంలో జడ్పీచైర్పర్సన్ వసంత, కలెక్టర్ రవితో కలిసి నియోజకవర్గానికి చెందిన 74 మంది దివ్యాంగులకు ఏడీఐపీ పథకం కింద బ్యాటరీ ట్రై సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడారు. సమాజంలో నిస్సహాయ స్థితిలో ఉన్న దివ్యాంగులకు సామాజిక భద్రత, గౌరవం తో కూడిన జీవితాన్ని కల్పించేందుకు రాష్ట్ర ప్రభు త్వం కృషి చేస్తున్నదన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా ప్రతి నెల రూ.3 వేల పింఛన్ అందిస్తున్నామన్నారు. దివ్యాంగులకు ఎలాంటి ఆపద వచ్చినా తనకు ఫోన్ చేయాలని, అర్ధరాత్రి అయినా స్పందిస్తానని చెప్పారు. దివ్యాంగులకు మరింత చేయూత ఇవ్వాలనే ఉద్దేశంతో రూ.37వేల విలువైన అధునాతన ట్రై సైకిళ్లను అందిస్తున్నామన్నారు.
జగిత్యాల జిల్లా వ్యాప్తం గా ఇదివరకు 489 మంది దివ్యాంగులకు ట్రైసైకిళ్లు అందజేశామని, ఇటీవలే మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా హైదరాబాద్లో రూ.22కోట్ల 36లక్షల విలువైన ఉపకరణాలకు అందించామన్నారు. అలాగే తన తల్లిదండ్రుల పేరున నెలకొల్పిన ఎల్ఎమ్ కొప్పుల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటివరకు చాలా మందికి ట్రైసెకిళ్లు, వినికిడి యంత్రాలు, వీల్చైర్లు, సంక కర్రలు అందజేసినట్లు చెప్పారు. ది వ్యాంగులను, సకలాంగులు వివాహం చేసుకున్న జంటకు రూ.50వేల చొప్పున ప్రోత్సాహకాన్ని అందజేస్తున్నట్లు గుర్తు చేశారు. ఆ తర్వాత ధమ్మన్నపేటలోని కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. కార్యక్రమాల్లో డీసీఎమ్మెస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, డీడబ్ల్యూఓ డాక్టర్ నరేశ్, జడ్పీటీసీలు బాధినేని రాజేందర్, బత్తిని అరుణ, ఎంపీపీ చిట్టిబాబు, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, ఏఎంసీ చైర్మన్ రాజేశ్కుమార్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ భీమయ్య, పీఏసీఎస్ చైర్మన్ నరేశ్, ఏఎంసీ వైస్ చైర్మన్ సునీల్కుమార్ ఉన్నారు.