మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల వద్ద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు సుమారు 1000 నుంచి 1400 ఎకరాలు ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉంది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆ ప్రాంతంలో యూనిట్ ఏర్పాటుకు టీఎస్ఐఐసీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధిత అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. ఇప్పటి వరకు మిర్యాలగూడ పరిసర ప్రాంతాలకు చెందిన చాలా మంది టీఎస్ఐఐసీకి దరఖాస్తు చేసుకున్నారు.
డీడీలు చెల్లించిన 120 మంది
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో భాగంగా ఆధునిక టెక్నాలజీతో రైస్మిల్లులు ఏర్పాటు చేసేందుకు వ్యాపారులు ముందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు టీఎస్ఐఐసీకి 200 మంది వివిధ రకాల పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కొక్కరు రూ. 10 లక్షల చొప్పున 120 మంది డీడీలు కూడా అందజేశారు. గంటకు 15 నుంచి 50 టన్నుల మిల్లింగ్ కెపాసిటీతో రైస్మిల్లు ఏర్పాటు చేసేందుకు వ్యాపారులు ముందుకు వస్తున్నారు. ఈ ప్రాంతంలో రైస్ ఇండస్ట్రీల నిర్మాణం పూర్తయితే రాష్ట్రంలో పండించే మొత్తం ధాన్యంలో మూడోవంతు మిర్యాలగూడ ప్రాంతంలోనే మిల్లింగ్ చేసే అవకాశం ఉంటుంది.
24 రకాల పరిశ్రమలు
టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో 24 రకాల పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారు. రైస్ ఇండస్ట్రీ, సుగంధ ద్రవ్యాల తయారీ, ఆహార ధాన్యాలతో ఇథనాల్ తయారీ, పార్బాయిల్డ్ రైస్ ఇండస్ట్రీ, పప్పుధాన్యాల ప్రాసెసింగ్, బస్తాల తయారీ, రారైస్ ఇండస్ట్రీ, జిన్నింగ్, ఆయిల్మిల్స్, పండ్లు కూరగాయల గ్రేడింగ్, ఎక్స్పోర్టింగ్, స్టోరేజ్ గోదాం, ధాన్యం ప్రీ ప్రాసెసింగ్, స్టోరేజ్, కాటన్ జిన్నింగ్, ఆయిల్ ప్రాసెసింగ్, ప్లాస్టిక్ సంచుల తయారీ, ద్రావణం వెలికితీత కర్మాగారం, విద్యుత్ ఉత్పత్తి, మిరపకాండం కటింగ్ ఇండస్ట్రీ, చేపల ఫీడ్ తయారీ, మల్టీ గ్రెయిన్ ప్రాసెసింగ్, బిస్కెట్ల తయారీ, సేంద్రియ ఆహారం, పానీయాల తయారీ, వేరుశనగ ప్రాసెసింగ్, మీట్, పౌల్ట్రీ, ఫిష్ ప్రాసెసింగ్, పిండి మిల్లులకు అనుమతులు ఇవ్వనున్నారు.
ఆధునిక టెక్నాలజీతో రైస్మిల్లులు
మిర్యాలగూడ పరిసరాలు సాగర్ ఆయకట్టు పరిధిలో ఉండడంతో మొదటి నుంచి ఈ ప్రాంతంలో రైస్ మిల్లులు అధికంగా ఏర్పాటు చేశారు. ఆసియా ఖండంలోనే అత్యధిక రైస్మిల్లులు ఈ ప్రాంతంలో ఉన్నాయి. మిర్యాలగూడ నుంచి దేశ, విదేశాలకు బియ్యం ఎగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో భాగంగా ఇక్కడి వ్యాపారులు 100 నుంచి 200 వరకు రైస్ మిల్లులు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నారు. గంటకు 10 నుంచి 50 టన్నుల వరకు మిల్లింగ్ కెపాసిటీతో ఆధునిక టెక్నాలజీతో రైస్మిల్లులు ఏర్పాటు చేసేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు.
వేలాది మందికి ఉపాధి
మిర్యాలగూడ నియోజకవర్గంలో ఏర్పాటు చేసే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వల్ల వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభించే అవకాశం ఉంది. ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించడంతో పాటు పరోక్షంగా కూడా ఉపాధి అవకాశాలు అందుతాయి. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మిర్యాలగూడ మరింత అభివృద్ధి
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుతో మిర్యాలగూడ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుంది. పలు రకాల పరిశ్రమలు ఏర్పాటు కావడం వల్ల వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. రైస్మిల్లుల ఏర్పాటుతో మన రాష్ట్రంలోని ధాన్యంలో మూడో వంతు మిర్యాలగూడ ప్రాంతంలోనే మిల్లింగ్ చేసే అవకాశం ఉంటుంది. నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతుంది.
భూములు పరిశీలించాం
ఫుడ్ ప్రాసెసింగ్ యూ నిట్ ఏర్పాటుకు దామరచర్ల మండలంలో రెండు చోట్ల, మిర్యాలగూడ మం డలం ఆలగడపలో భూములు పరిశీలించాం. ఉన్నతాధికారులకు నివేదిక పంపించాం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటైతే ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది.