నిర్మల్ అర్బన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కవులు, కళాకారులకు ప్రాధాన్యమిస్తూ వారికి తగిన గౌరవాన్ని కల్పిస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మన కవులు, కళాకారులకు మంచి ఆదరణ, అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల పెన్షన్ను మంజూరు చేసినందుకు గుస్సాడీ కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు గురువారం నిర్మల్లోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్రెడ్డి- విజయలక్ష్మి దంపతులు కనకరాజును శాలువా కప్పి సన్మానించారు.
ప్రభుత్వం తరఫున తనకు ఇల్లు కట్టించి ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించేలా చూడాలని కనకరాజు మంత్రిని కోరారు. ఈ విషయాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తనవంతు సహాయం చేస్తానని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. కనకరాజుకు, ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మర్లవాయి సర్పంచ్ ప్రతిభ వెంకటేశ్వర్ రావు, ఆదివాసీ నాయకులు ఆత్రం భుజంగరావు, ఆత్రం శంకర్, టీఆర్ఎస్ నాయకులు ఇంతియాజ్ ఖాన్, జుగ్నాక దేవ్, తదితరులు పాల్గొన్నారు.