కరోనా వైరస్ బయట ఎంత దారుణంగా ఉందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజుకు కొన్ని వేలాది మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అందులో పలువురు ప్రముఖులు కూడా ఉంటున్నారు. రోజుకు కనీసం అరడజను మంది ప్రముఖులు మరణించడం రోజూ చూస్తూనే ఉన్నాం. తాజాగా మరో సినీ ప్రముఖుడి ఇంట ఇంకా ఈ వైరస్ విషాదం నింపింది. సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు సుబ్బు తన తల్లి మంగమ్మ గారిని పోగొట్టుకున్నాడు. వైరస్ బారిన పడి ఆమె మే 16 రాత్రి మరణించారు. కేవలం ఐసీయూలో బెడ్ దొరక్కపోవడంతో ఈమె ప్రాణాలు కోల్పోయారు. దేశంలో సామాన్యుడైన, ప్రముఖులైన ప్రస్తుతం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు.
అక్కడ ఐసియు కోసం నానా తంటాలు పడుతున్నారు. ఒక బెడ్ కావాలి అంటూ రికమండేషన్స్ పెట్టుకుంటున్నారు. అయినా కూడా పరిస్థితులు సహకరించడం లేదు. కావాల్సిన వాళ్లను పోగొట్టుకుంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. మొన్నటికి మొన్న సీనియర్ నటుడు గౌతమ్ రాజు తమ్ముడు సిద్ధార్థ ఇలాగే ఆక్సిజన్ కొరతతో మరణించారు. అలాగే హీరోయిన్ పియా బాజ్ పేయి సోదరుడు కూడా ఆక్సిజన్ దొరక్క మరణించాడు. ఇప్పుడు సుబ్బు తల్లి కూడా ఇలాగే ప్రాణాలు కోల్పోయారు. సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో ఈయన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తొలి సినిమా విడుదలైనప్పుడు తన తల్లికి చూపించి ఎంతో సంతోషపడ్డాడు. అలాంటిది ఇప్పుడు ఆయన తల్లి మరణించడంతో ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు దర్శకుడు సుబ్బుకు ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు.