ఈ నెల 28 నుంచి టీకా వేసేందుకు కార్యాచరణ
ప్రతి మండల కేంద్రంలో రెండు చోట్ల కేంద్రాలు
కోవాగ్జిన్ రెండో డోస్ ప్రారంభం
ఖమ్మం మే 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొవిడ్ నియంత్రణ కోసం ప్రభుత్వ మరిన్ని చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేయించుకోకుండా ఉన్న పలు రంగాలకు చెందిన వారిని కొవిడ్ వ్యాప్తికి కారకులుగా గుర్తించి వాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో వ్యాక్సిన్ అవసరం ఉన్న వారిని గుర్తించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. అత్యవసర సమయంలోనూ వివిధ రూపాల్లో సమాజానికి సేవలు అందిస్తున్న వంటగ్యాస్ డెలివరీ సిబ్బంది, రేషన్ షాపు డీలర్లు, పెట్రోల్ బంకు సిబ్బంది, ఆటో క్యాబ్డ్రైవర్లు, కూరగాయ మార్కెట్లోని వ్యాపారులు, పూలు, పండ్ల వ్యాపారం చేసేవారు, కిరాణా, వైన్షాపులు, మాంసం దుకాణాల్లో పనిచేసే వారు, హమాలీలను కరోనా వ్యాప్తి కారకులుగా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 28వ తేదీ నుంచి జిల్లాలో వారికి వ్యాక్సిన్ వేసేందుకు కార్యాచరణ ప్రారంభించారు. ఖమ్మం జిల్లాలో దాదాపు 25 వేల నుంచి 30వేల వరకు సూపర్ స్ప్రెడర్స్ ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. అధికారులు ఈ మేరకు వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్గా చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు ఖమ్మం నగరంలో పది ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, కేంద్రాల వద్ద ఒత్తిడి లేకుండా, భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రతి మండల కేంద్రంలోనూ రెండుచోట్ల ఈ వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
రెండో డోస్ టీకా ప్రారంభం
భద్రాద్రి జిల్లాలో 4,300 మందికిగాను తొలిరోజు 2,498 మందికి రెండో డోస్ టీకా వేశారు. కోవాగ్జ్జిన్ ఫస్ట్ డోస్ వేయించుకున్న వారికి మాత్రమే రెండో డోస్ టీకా వేస్తారు. కోవిషీల్డ్ వేసుకున్న వారికి ఇంకా సమయం ఉందని, వారికి టీకాలు వేయలేదు. ఖమ్మం జిల్లాలో రెండో డోస్ కోసం 2,709 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. వారందరికీ జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో టీకాలు వేశారు. కోవాగ్జిన్ రెండో డోస్ కార్యక్రమం బుధవారం కూడా ఉంటుందని డీఎంహెచ్వో డాక్టర్ బీ మాలతి పేర్కొన్నారు.