హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ ): తనకంటూ ఓ సొంతిల్లు ఉండాలన్నది ప్రతి వ్యక్తి కల. పైసాపైసా కూడబెట్టి కలల సౌధాన్ని నిర్మించుకొనేందుకు శ్రమిస్తుంటారు. గతంలో సొంతిల్లు నిర్మించుకోవాలంటే మున్సిపల్ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ దుస్థితికి తెరపడింది. రాష్ట్రప్రభుత్వం నూతన మున్సిపల్ చట్టంలో భాగంగా తీసుకొచ్చిన తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (టీఎస్ బీపాస్)తో ప్రజలు ఫుల్ ఖుష్గా ఉన్నారు. ప్రారంభించిన 100 రోజుల్లోనే టీఎస్ బీపాస్కు 10వేల దరఖాస్తులు వచ్చాయి. ఈ విధానంలో 70 గజాలలోపు ఇంటి నిర్మాణానికి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. 600 గజాలవరకు అప్పటికప్పుడు అనుమతి ఇస్తారు. వాణిజ్య భవనాలకు 21రోజుల్లోపు అనుమతులు లభిస్తాయి.
టీఎస్ బీపాస్ను మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు గతేడాది నవంబర్ 16న ప్రారంభించగా సగటున రోజుకు వంద చొప్పున దరఖాస్తులు వచ్చాయి. ఫిబ్రవరి 21 వరకు డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టం (డీపీఎంఎస్) ద్వారా కూడా దరఖాస్తులకు అనుమతులు ఇచ్చారు. ఫిబ్రవరి 22 నుంచి డీపీఎంఎస్ విధానంలో 600 గజాలలోపు గృహ నిర్మాణాలకు అనుమతులు నిలిపివేశారు. ఆ రోజునుంచి ఇప్పటివరకు టీఎస్ బీపాస్కు సగటున రోజుకు 200 చొప్పున 2వేల దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ నుంచి 681 మంది దరఖాస్తు చేశారు. మొత్తం దరఖాస్తుల్లో 8 వేలు ఇన్స్టంట్ అప్రూవల్ దరఖాస్తులు కాగా, 1,900 ఇన్స్టంట్ రిజిస్ట్రేషన్ విధానంలో వచ్చాయి. మిగిలినవి సింగిల్ విండో విధానంలో వచ్చాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అత్యధిక దరఖాస్తులు రాగా ఆ తర్వాతి స్థానంలో రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలు ఉన్నాయి.
టీఎస్ బీపాస్కు దరఖాస్తు కు చేసిన. వెంటనే అనుమతి పత్రం వచ్చింది. దీనిని తీసుకెళ్లి విద్యుత్తు అధికారుల వద్ద దరఖాస్తు చేస్తే మీటర్ కనెక్షన్ను మూడు రోజుల్లో ఇచ్చారు. ఆ తరువాత ఆర్ అండ్ బీ అధికారులు వచ్చి రోడ్డు, ప్లాట్ కొలతలు తీసుకొని వెళ్లారు. నేను ఏ ఒక్కరికీ ఒక్క పైసా కూడా లంచం ఇవ్వలేదు. మమ్మల్ని ఎవరూ డబ్బు అడగలేదు.
– అడప కృష్ణయ్య, ఖమ్మం
ఆన్లైన్లో ఇంటి నిర్మాణానికి అనుమతిచ్చే విధా నం చాలా బాగుం ది. చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఆన్లైన్లో ఈజీగా అయిపోయింది. మాకు తెలిసిన వాళ్లతో ఆన్లైన్లో అప్లయ్ చేశాం. ఇంటికి అనుమతి తీసుకోవడం చాలా ఈజీగా అనిపించింది. ఆ తర్వాత ఆఫీసర్లు వచ్చి వెరిఫై చేశారు. నేను మొదటి సారిగా ఇల్లు కడుతున్నా. ఎవ్వరికీ లంచం ఇవ్వలేదు.
-వీ విష్ణువర్ధన్ రెడ్డి, మహబూబ్నగర్
ఇంటి నిర్మాణానికి ఏ ఆఫీసు చుట్టూ తిరగకుండానే పర్మిషన్ వచ్చింది. గతంలో ఇల్లు నిర్మాణం అంటే ఆఫీసుల చుట్టూ తిరగాలి.. వాళ్లకు వీళ్లకు లంచం ఇవ్వాలి అనేవారు. టీఎస్ బీపాస్లో మాత్రం నేను ఎవ్వరికీ లంచం ఇవ్వలేదు.
-సుల్తాన్ దేవేందర్రెడ్డి, జనగామ