‘సినిమా తప్ప నాకు వేరే ప్రపంచమేది తెలియదు. ఎన్ని కష్టాలు ఎదురైన సినీపరిశ్రమకు దూరం కాను’ అని అన్నారు శ్రీనువైట్ల. ఢీ, రెడీ, కింగ్ వంటి చిత్రాలతో దర్శకుడిగా అద్వితీయ విజయాల్ని అందుకున్నారాయన. వినోదాత్మక చిత్రాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం పలికారు. మహేష్బాబు హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన ‘దూకుడు’ చిత్రం విడుదలై నేటితో పదేళ్లు పూర్తయ్యాయి. శుక్రవారం శ్రీనువైట్ల పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విశేషాలివి..
“దూకుడు’ నా కెరీర్లో బెస్ట్ బర్త్డే గిఫ్ట్గా నిలిచింది. నా పుట్టినరోజుకు ఒకరోజు ముందుగా విడుదలైన ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది. నా జీవితంలో మరచిపోలేని జ్ఞాపకంగా మిగిలింది. ప్రయోగాత్మకంగా భావించి ‘దూకుడు’ సినిమా చేశాం. మహేష్బాబును ఎవరూ చూపించని కోణంలో కొత్తగా ఆవిష్కరించాలనే ఆలోచన నుంచే కథకు అంకురార్పణ పడింది. ఈ కథకు ఎలాంటి రిఫరెన్స్ లేదు. ట్రెండ్ సెట్టర్గా నిలవాలనే పట్టుదలతో శ్రమించాం. మా నమ్మకం నిజమైంది.
అందుకే వర్కవుట్ కాలేదు
కాలం మారినా కామెడీని ఆదరించే విషయంలో ప్రేక్షకుల ఆలోచన ధోరణిలో మార్పురాలేదు. ఇప్పటికీ నేను చేసిన సినిమాల్లోని పాత్రలు సోషల్మీడియాల్లో మీమ్స్గా కనిపించడం ఆనందంగా అనిపిస్తుంటుది. నా కామెడీ టైమింగ్కు తగిన కథల్ని ఎంచుకోవడంలో తడబడటంతోనే కొన్ని సినిమాలు వర్కవుట్ కాలేదు. భవిష్యత్తులో ఆ తప్పుల్ని పునరావృతం చేయకుండా జాగ్రత్తపడతాను. సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ విషయంలో ప్రథమ బాధ్యత దర్శకుడిదే. సక్సెస్ వస్తే నేను ఒక్కడినే క్రెడిట్ తీసుకోను. పరాజయాలను ఇతరులకు ఆపాదించను. మంచు విష్ణుతో నేను చేస్తున్న ‘ఢీ అండ్ ఢీ డబుల్ డోస్’ సినిమా నవంబర్ ప్రథమార్థంలో మొదలుకానుంది. ‘ఢీ’ చిత్రానికి సీక్వెల్ కాదిది. సరికొత్త కథ, కథనాలతో రూపొందిస్తున్నాం. ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆద్యంతం నవ్విస్తూనే ఉంటుంది. కరోనా కారణంగా లభించిన విరామంలో మరో రెండు కథల్ని రాసుకున్నా. నేటి ట్రెండ్కు తగినట్లుగానే ఇవి ఉంటాయి.