శంకర్పల్లి, నవాబుపేట, చేవెళ్ల మండలాల్లో పర్యటించిన మంత్రి, ఎమ్మెల్యే కాలె యాదయ్య
శంకర్పల్లి రూరల్, జూలై 8 : ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని.. పల్లె, పట్టణ ప్రగతితో మార్పు స్పష్టంగా కనిపిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం శంకర్పల్లి మండలం గోపులారం, మహరాజ్పేట్, దొంతాన్పల్లి గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి మంత్రి పాల్గొన్నారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బుల్కాపూర్ క్రిస్టల్ వెంచర్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పల్లె ప్రగతి స్ఫూర్తి ఎల్లవేళలా కొనసాగించాలని సూచించారు. ఈ ప్రాంతంలో ఏర్పాటవుతున్న వివిధ రకాల కంపెనీల్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు చిన్న తరహా దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు రంగారెడ్డిజిల్లాలో 3174 మందికి రుణాలు అందించినట్లు చెప్పారు.
వచ్చే నెల నుంచి 57 ఏండ్ల వయసు వారికి ఆసరా పింఛన్లు అందించనున్నట్లు చెప్పారు. గతంలో దరఖాస్తు చేసుకున్న 4.70లక్షల మంది అర్హులకు త్వరలో రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు.ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ గురుకులాలను ఏర్పాటు చేసినట్లు, వీటికి మంచి డిమాండ్ ఉందన్నారు. దళితవాడలో పాదయాత్ర ద్వారా సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని సీఎం కేసీఆర్ తమను ఆదేశించినట్లు చెప్పారు. డంపింగ్యార్డులు, నర్సరీలు, వైకుంఠధామాలతో గ్రామాలకు నూతన శోభ ఏర్పడిందన్నారు. చేవెళ్లలో ఇటీవల నిర్వహించిన జాబ్మేళా ద్వారా ఎంపికైన 230 మందికి శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. పల్లె ప్రకృతివనాల్లో వివిధ రకాల పండ్ల మొక్కలు నాటడం సంతోషకరమన్నారు.కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, ఎంపీడీవో సత్తయ్య, సర్పంచులు శ్రీనివాస్, నర్సింహారెడ్డి, అశ్విని, రవీందర్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ శశిధర్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్, నాయకులు గోవర్ధన్రెడ్డి, రాజునాయక్ పాల్గొన్నారు.
హరితహారంతో సంపూర్ణ ఆరోగ్యం
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, స్వచ్ఛమైన వాతావరణంతోనే సంపూర్ణ ఆరోగ్యం అందుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం మైతాబ్ఖాన్గూడ ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో ఆదర్శ పాఠశాల కస్తూర్బాగాంధీ పాఠశాలలో మొక్కలు నాటి నీరు పోశారు. హరితహారం కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని తెలిపారు. మొక్కలను నాటడంతోపాటు సంరక్షించే బాధ్యతలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ స్థలాల్లో, రోడ్లకు ఇరువైపులా, ఇండ్ల ఎదుట పండ్లు, కాయలు, పూలు, ఔషధ మొక్కలు నాటి పెంచాలని పేర్కొన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజాప్రతినిధులకు మంత్రి సూచించారు.
ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న హరితహారం, పల్లె ప్రగతి కార్యక్రమాలతో గ్రామాలు శుభ్రంగా మారి పచ్చని వనాలుగా మారుతాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ భవాని, జడ్పీటీసీ జయమ్మ, పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నాగిరెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకట్రెడ్డి, సర్పంచ్లు రఫీ, బల్వంత్రెడ్డి, విజయలక్ష్మి, విమలమ్మ, ఎంపీటీసీలు సుమలత, పద్మ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మల్లారెడ్డి, రంగారెడ్డి, భరత్రెడ్డి, ప్రకాశం, ప్రభాకర్, జైపాల్రెడ్డి, మాణిక్యరెడ్డి, శాంతకుమార్ ఉన్నారు.
కుల వృత్తుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
గొల్ల కురుమలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి సబితారెడ్డి అన్నారు. గురువారం చేవెళ్ల మండలం అల్లవాడలో రూ.52.5కోట్ల విలువగల గొర్రెలను 42 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి పంపిణీ చేశారు. అదేవిధంగా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గొల్ల, కురుమలకు గొర్రెలను పంపిణీ చేసి వారిని ఆదుకుంటున్నారని తెలిపారు. కులవృత్తుల వారికి ఆదరణ కల్పించడం కోసం ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.8వేల కోట్లతో గొర్రెల పంపిణీకి సీం కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మిషన్ కాకతీయతో చెరువుల్లో జల కళ వచ్చిందన్నారు. ముదిరాజ్, మత్స్యకారుల అభివృద్ధికి చెరువుల్లో చేపపిల్లలు వదిలే కార్యక్రమంతో వారు అర్థికంగా ఎదుగడానికి దోహదం చేస్తున్నదని తెలిపారు.
దూరదర్శన్, టీ సాట్ ద్వారా విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో సకల సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. పాఠ్యపుస్తకాలపై ప్రభుత్వం 80 కోట్లు ఖర్చు చేస్తున్నదన్నారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందజేస్తున్నదని పేర్కొన్నారు. అల్లవాడ ప్రభుత్వ పాఠశాల అవరణలో మంత్రి మొక్కలు నాటారు. ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ.. గొల్ల, కురుమలకు గొర్రెలను పంపిణీ చేయడంతోపాటు గడ్డి విత్తనాలు, నట్టల నివారణ మందులు అందజేసినట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న గొర్రెలతో గొల్లకురుమలు అభివృద్ది చెందాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, వైస్ ఎంపీపీ శివప్రసాద్, ఆర్డీవో వేణుమాధవరావు, సర్పంచ్ భీంరెడ్డి, ఎంపీటీసీ సత్యనారాయణచారి, గొల్ల కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు సదానందం, జిల్లా వెటర్నరీ అధికారి అంజిలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్య, వైద్యురాలు శిరీష ఉన్నారు.