ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
జములమ్మ రిజర్వాయర్కు నీటి విడుదల
గద్వాల అర్బన్, జూలై 1 : రైతులు సమన్వయంతో సాగు నీటిని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని జములమ్మ రిజర్వాయర్ వద్ద కృష్ణమ్మకు గురువారం ఎమ్మెల్యే పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో 15 రోజుల కిందట ర్యాలంపాడు రిజర్వాయర్ పంప్ హౌస్ నుంచి నీటిని విడుదల చేశారన్నారు. ప్రస్తుతం వానకాలంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుగానే ఈ ఏడాది నీటిని విడుదల చేస్తామని తెలిపారు. గతంలో రైతులు ఎన్నో కష్టాలు పడ్డారని, అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. అప్పటి పరిస్థితుల్లో రైతులు వ్యవసాయం దండుగ అనే దుస్థితి నెలకొందని అలాంటి సమయంలో సీఎం కేసీఆర్ రైతుల కష్టాలు దృష్టి లో ఉంచుకొని వారిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని కృషి చేస్తున్నారు. గత ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా రెండు పంటలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య, ఎంపీపీ ప్రతాప్ గౌడ్, నీటి పారుదల శాఖ అధికారులు ఉన్నారు.
బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
జిల్లాకేంద్రం సమీపంలోని జమ్మిచేడు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ నాగరాజు మాతృమూర్తి సవారమ్మ గురువారం అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వారి నివాసానికి చేరుకొని సవారమ్మ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే వెంట ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య, జములమ్మ ఆలయ కమిటీ చైర్మన్ సతీశ్ ఉన్నారు.
క్యూఆర్ కోడ్ అప్లికేషన్ ఆవిష్కరణ
ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు సమాచారం తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్ ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాయలంలో వాహనదారుల భద్రత కోసం ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ అప్లికేషన్ను ఎమ్మెల్యే గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర సమయంలో ఈ కోడ్ను స్కాన్ చేస్తే సమాచారం కుటుంబ సభ్యులకు తెలుస్తుందన్నారు. వాహనం యొక్క ధ్రువపత్రాలు కూడా ఇందులో పొందుపరుస్తారని, వాటి యొక్క గడువు తేదీని తెలియజేస్తుందని వివరించారు. కార్యక్రమంలో డాడీస్ జిల్లా ఇన్చార్జ్ అనుదీప్ ఉన్నారు.
విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న ఎమ్మెల్యే
మల్దకల్, జూలై 1 : మండల కేంద్రంలోని స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో శ్రీ శేషదాసుల వారి కట్ట వద్ద గురువారం శ్రీశేషదాసుల విగ్రహం, శ్రీ విజయదాసుల విగ్రహాన్ని అర్చకులు రమేశ్చారి, మధుసూదన్చారి, ప్రసన్న చారి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించారు. ఈ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఎంపీపీ రాజారెడ్డి, జెడ్పీటీసీ ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శేష దాసుల వంశస్తులు ధీరేంద్రదాసు, శేషగారిరావు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో చైర్మన్ ప్రహ్లాదరావు, వెంకటేశ్వర్ రావు, బాబురావు,వెంకోబరావు, రాఘవేంద్రదాస్, బ్రాహ్మణులు పాల్గొన్నారు.