పకడ్బందీగా పారిశుద్ధ్య నిర్వహణ..
రూ.కోటీ 70 లక్షలతో అభివృద్ధి పనులు
ఆదర్శంగా నిలుస్తున్న గ్రామం
కోటగిరి, ఏప్రిల్ 23 :ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. గతంలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న పల్లెలు.. నేడు వెలుగులు జిమ్ముతున్నాయి. లక్షల నిధులు వెచ్చించి పల్లెలను పట్టణాలను తీసిపోని విధంగా తీర్చిదిద్దుతున్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కల్లూర్ గ్రామం అభివృద్ధికి మారుపేరుగా నిలుస్తున్నది. రూ. కోటీ 70 లక్షలు వెచ్చించడంతో అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. గ్రామంలో ఎంతో కాలంగా ఎదురు చూసిన వైకుంఠధామం నిర్మాణం పూర్తయ్యింది. కంపోస్టుషెడ్డు, పల్లె ప్రకృతి వనం, గ్రామంలో గల్లీగల్లీకి సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఇలా ఎటు చూసినా అభివృద్ధి కనిపిస్తున్నది. గ్రామస్తులందరూ ఏకతాటిపైకి వచ్చి గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారు. పొతంగల్- బీర్కూర్ ప్రధాన రహదారి నుంచి గ్రామం వరకు రూ.12లక్షలతో సీసీ రోడ్డు పనులు పూర్తి చేశారు. కల్యాణ మండపం, ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత, మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశారు.
పకడ్బందీగా పారిశుద్ధ్య నిర్వహణ
శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రూ. కోటీ 70లక్షలపైగా నిధులు మంజూరు చేయడంతో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడంతో దశల వారీగా సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాం.
-వోలే లక్ష్మీ లింగప్ప, సర్పంచ్