ఆర్బీఐ మాజీ గవర్నర్ నరసింహం కన్నుమూత
హైదరాబాద్, ఏప్రిల్ 21: ఆధునిక భారతీయ బ్యాంకింగ్ నిర్మాత, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ మైదవోలు నరసింహం (94) కన్నుమూశారు. కరోనాతో ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మంగళవారం తుదిశ్వాస విడిచినట్లు ఆర్బీఐ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. 1927 జూన్ 3న బెంగళూరులో జన్మించినప్పటికీ.. ఆయన కుటుంబం మాత్రం గుంటూరు జిల్లాకు చెందినదే. 1977 మే 2 నుంచి నవంబర్ 30 వరకు 7 నెలలపాటు ఆయన ఆర్బీఐ 13వ గవర్నర్గా పనిచేశారు. రిజర్వ్ బ్యాంక్లో ఉద్యోగి నుంచి గవర్నర్ స్థాయికి ఎదిగిన ఏకైక వ్యక్తి నరసింహమే కావడం గమనార్హం. ఆర్బీఐ ఆర్థిక విభాగంలో రిసెర్చ్ ఆఫీసర్గా నరసింహం ప్రస్థానం మొదలైంది. ప్రపంచ బ్యాంక్లో భారత్కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేసిన ఆయన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా కూడా సేవలందించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్)లోనూ పనిచేశారు. 1991లో ఆర్థిక వ్యవస్థపై వేసిన కమిటీకి, 1998లో బ్యాంకింగ్ రంగ సంస్కరణలపై ఏర్పాటు చేసిన కమిటీకి నరసింహం నేతృత్వం వహించారు. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్, కొటక్ మహీంద్రా బ్యాంక్ల సృష్టి వెనుక నరసింహం చేసిన సిఫార్సులే ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ, విలీనాల ఆలోచనా ఈయనదే. ఈ క్రమంలోనే ఆయన బ్యాంకింగ్ సంస్కరణల పితామహుడిగా పేరొందారు. 2000వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో ఆయన్ను సత్కరించింది.